యూఏఈ అధికారులు ఈ అరెస్టులను రెండు విభిన్న దశల్లో చేపట్టారు. మొదట శనివారం నాడు ఇద్దరు భారతీయులతో సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తాజాగా నిర్వహించిన తనిఖీల్లో వివిధ దేశాలకు చెందిన మరో 25 మందిని అరెస్ట్ చేశారు. ఈ రెండో బృందంలో ఏకంగా 17 మంది భారతీయులు ఉన్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 19 మంది భారతీయులు కటకటాల పాలయ్యారు. వీరందరిపై యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షంసీ వేగవంతమైన విచారణకు ఆదేశించారు.
మూడు రకాల అభియోగాలు
దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం, నిందితులను మూడు వర్గాలుగా విభజించి అభియోగాలు నమోదు చేశారు:
1. మొదటి గ్రూపు: క్షిపణి దాడులు లేదా గగనతలంలో వాటిని అడ్డుకుంటున్న అసలు వీడియోలను రికార్డ్ చేసి, వాటికి భయం కలిగించే సౌండ్ ఎఫెక్ట్స్, తప్పుడు వ్యాఖ్యానాలను జోడించి ప్రచారం చేశారు.
2. రెండో గ్రూపు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఇతర దేశాల్లో జరిగిన పేలుళ్ల దృశ్యాలను యూఏఈలో జరిగినట్లుగా నకిలీ వీడియోలు సృష్టించారు.
3. మూడో గ్రూపు: శత్రు దేశమైన ఇరాన్ సైనిక చర్యలను, ఆ దేశ నాయకత్వాన్ని కీర్తిస్తూ పోస్టులు పెట్టడం ద్వారా జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించారు.