అసలు ఆ రోజు ఏం జరిగింది.?
2013 ఫిబ్రవరి 21వ తేదీ యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాత్రి 7 గంటలకు దిల్సుఖ్ నగర్లోని 107 నెంబర్ బస్టాప్ వద్ద మొదటి బాంబు పేలింది. మరికొద్ది క్షణాల వ్యవధిలో కోణార్క్ థియేటర్ సమీపంలోని ఏ-1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ దాడుల్లో మొత్తం 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే మొదట సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
తొలుత అప్పటి ప్రభుత్వం ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేయాలని అనుకుంది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ శరవేగంగా దర్యాప్తును మొదలు పెట్టింది. ఈ దాడులకు పాల్పడింది ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ అనే ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
విచారణలో భాగంగా ఎన్ఐఏ అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను 2013లోనే ఇండో-నేపాల్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్ తీసుకొచ్చి విచారించగా దాడులకు పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. విచారణలో వీరిద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా బిహార్కు చెందిన తహసీన్ అక్తర్, పాకిస్థాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్లను 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకు చెందిన అజిజ్ షేక్ను సైతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
అయితే పేలుళ్లలో ప్రధాన సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియా రియాజ్ బక్తల్గా విచారణలో తేలింది. కర్ణాటక బక్తల్క్కు చెందిన రియాజ్ బక్తల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బక్తల్ పాకిస్థాన్లో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ప్రస్తుతం అతనిపై రెడ్ కార్నర్ నోటీసు ఉంది. మొత్తం 6 గురిపై ఎన్ఐఏ 3 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది.