దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్ట్ కీలక తీర్పును వెల్లడించింది. పేలుళ్లకు కారణమైన ఐదుగురు దోషులకు ఉరిశిక్ష వేయడమే సరైన నిర్ణయమని హైకోర్ట్ అభిప్రాయపడింది. ఇది వరకే NIA కోర్టు వెల్లడించిన తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టులో సవాల్ చేయగా వాదనలు విన్న అనంతరం తెలంగాణ హైకోర్ట్ కూడా ఉరి శిక్షవేయడమే సరైన నిర్ణయమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దిల్సుఖ్ నగర్లో 2013 ఫిబ్రవరి 21వ తేదీన జరిగిన జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పేలుళ్లకు పాల్పడ్డ అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, మహమ్మద్ అహ్మద్ సిద్ధిబప అలియాస్ యాసిన్ భత్కల్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె వారికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ మంగళవారం కోర్టు తీర్పును వెలువరించింది. 2016లోనే నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది.
అయితే ఐదుగురు నిందితులు ఎన్ఐఏ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. కాగా తగిన సాక్ష్యాధారాలు లభించడంతో హైకోర్టు కూడా వీరికి ఉరి సరైన న్యాయమని ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. ఈ జంట పేలుళ్ల కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ (యూపీ), జియా-ఉర్-రెహమాన్ (పాకిస్థాన్), తెహసీన్ అక్తర్ (బీహార్), అజాజ్ షేక్ (మహారాష్ట్ర) కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.
Dilsukhnagar bomb blast
అసలు ఆ రోజు ఏం జరిగింది.?
2013 ఫిబ్రవరి 21వ తేదీ యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రాత్రి 7 గంటలకు దిల్సుఖ్ నగర్లోని 107 నెంబర్ బస్టాప్ వద్ద మొదటి బాంబు పేలింది. మరికొద్ది క్షణాల వ్యవధిలో కోణార్క్ థియేటర్ సమీపంలోని ఏ-1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ దాడుల్లో మొత్తం 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే మొదట సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
తొలుత అప్పటి ప్రభుత్వం ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేయాలని అనుకుంది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) రంగంలోకి దిగింది. వెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ శరవేగంగా దర్యాప్తును మొదలు పెట్టింది. ఈ దాడులకు పాల్పడింది ఇండియన్ ముజాహుద్దీన్ ఉగ్రవాద సంస్థ అనే ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
విచారణలో భాగంగా ఎన్ఐఏ అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను 2013లోనే ఇండో-నేపాల్ సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. వీరిని హైదరాబాద్ తీసుకొచ్చి విచారించగా దాడులకు పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. విచారణలో వీరిద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా బిహార్కు చెందిన తహసీన్ అక్తర్, పాకిస్థాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్లను 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు పుణేకు చెందిన అజిజ్ షేక్ను సైతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
అయితే పేలుళ్లలో ప్రధాన సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియా రియాజ్ బక్తల్గా విచారణలో తేలింది. కర్ణాటక బక్తల్క్కు చెందిన రియాజ్ బక్తల్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బక్తల్ పాకిస్థాన్లో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ప్రస్తుతం అతనిపై రెడ్ కార్నర్ నోటీసు ఉంది. మొత్తం 6 గురిపై ఎన్ఐఏ 3 చార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది.
Dilsukhnagar bomb blast
ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు:
5 గురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు పకడ్బందీగా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. వీరికి 2016 డిసెంబర్ 19వ తేదీన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. అయితే నిందితులు అదే ఏడాది ఎన్ఏఐ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ చేపట్టిన హైకోర్టు నిందితులు దాఖలు చేసిన అప్పీల్ను డిస్మిస్ చేసింది. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలకు పాల్పడింది వీరేనన్న సాక్ష్యాలు ఉండడంతో ఉరిశిక్ష సరైన నిర్ణయమని ఎన్ఐఏ తీర్పును సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది.