Motivational story: జీవితంలో ఎదగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఈ క్రమంలో పక్కవారితో పోల్చుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఇది ఓ స్థాయి దాటితే మన మనుగడకే ప్రమాదకరం. ఈ కథ చదివితే మీరు కూడా ఈ విషయాన్ని ఒప్పు కోవాల్సిందే.
ఒక చిన్న గ్రామంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు సాధారణ ఉద్యోగం చేస్తూ జీవించేవాడు. నెలకు వచ్చే జీతంతో జీవితం సాఫీగా సాగుతోంది. అయితే రాజు మనసు మాత్రం ప్రశాంతంగా ఉండేది కాదు. నిత్యం చుట్టూ ఉన్నవారిని చూసి ఎప్పుడూ అసూయ పడటం. ఎవరో కొత్త కారు కొంటే తనకేందుకు లేదని బాధపడేవాడు. ఎవరికైనా మంచి వ్యాపారం ఉంటే నేను ఎందుకు చేయలేకపోతున్నానని ఆలోచించేవాడు. అందరూ తనకంటే గొప్పగా ఉన్నారని, ఎక్కువగా సంపాదిస్తున్నారని అనుకుని బాధపడేవాడు. ఈ ఆలోచనల వల్ల అతనికి తన జీవితంపై సంతృప్తి ఉండేది కాదు. చేతిలో ఉన్న ఉద్యోగం, వస్తున్న జీతం కూడా అతనికి చిన్నదిగానే కనిపించేది.
25
పూర్తిగా దూరమైన సంతృప్తి
రోజులు గడుస్తున్నకొద్దీ రాజు అసహనం పెరుగుతూనే ఉంది. ఉద్యోగానికి వెళ్లినా సరిగా పనిచేసేవాడు కాదు. అందరూ లక్షలు సంపాదిస్తుంటే నేను ఈ చిన్న ఉద్యోగం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాని బాధపడేవాడు. ఈ ఆలోచనలు అతన్ని నిత్యం నిరాశలోకి నెట్టాయి. క్రమంగా అతను డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఏదైనా పెద్ద పని చేసి ఒక్కసారిగా డబ్బులు సంపాదించాలనే కోరిక అతని మనసులో పెరుగుతూ వచ్చింది.
35
తొందరపాటు నిర్ణయం
ఒక రోజు రాజు పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. “ఇలా చిన్న ఉద్యోగం చేస్తూ జీవితాంతం గడపడం కన్నా వ్యాపారం చేసి పెద్దగా సంపాదించాలి” అని అనుకున్నాడు. ఆ ఆలోచనతో అతను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాడు. అంతేకాదు, ఇంట్లో ఉన్న భార్య బంగారం, తల్లి దగ్గర ఉన్న నగలు అన్నీ అమ్మేశాడు. తండ్రికి చెందిన చిన్న భూమి కూడా అమ్మి ఆ డబ్బంతా తీసుకున్నాడు. అయితే అతను ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మర్చిపోయాడు. వ్యాపారం చేయాలంటే అవగాహన కావాలి, అనుభవం కావాలి. కానీ రాజుకు ఆ రెండూ లేవు. త్వరగా డబ్బులు సంపాదించాలన్న ఆతురత మాత్రమే ఉంది. అలాగే ముందుకు సాగి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు.
వ్యాపారం మొదలైన కొన్ని రోజులకే సమస్యలు మొదలయ్యాయి. సరైన ప్రణాళిక లేకపోవడం, అనుభవం లేకపోవడం వల్ల అతనికి నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. అయినా రాజు ఆగలేదు. “ఇంకొంచెం డబ్బు పెడితే తిరిగి లాభం వస్తుంది” అని భావించి మళ్లీ అప్పులు చేశాడు. కానీ పరిస్థితి మారలేదు. నష్టాలు మరింత పెరిగాయి. చివరికి రాజు పూర్తిగా నష్టపోయాడు. ఇంట్లో ఉన్న బంగారం పోయింది. తండ్రి భూమి కూడా పోయింది. ఉద్యోగం కూడా చేతిలో లేదు. పైగా అప్పులు కూడా అయ్యాయి. ఒకప్పుడు సాధారణంగా గడిచిన జీవితం ఇప్పుడు చాలా కష్టంగా మారిపోయింది.
55
ఈ కథ చెప్పే గొప్ప సందేశం
రాజు జీవితాన్ని చూసి గ్రామంలోని వారు ఒక విషయం అర్థం చేసుకున్నారు. పక్కవారిని చూసి ఎదగాలనే కోరిక తప్పు కాదు. ఇతరుల్లా విజయవంతం కావాలని అనుకోవడం కూడా తప్పు కాదు. కానీ అవగాహన లేకుండా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ప్రమాదకరం. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తే చివరికి రాజు పరిస్థితి వస్తుంది. మన సామర్థ్యం, మన పరిస్థితి, మనకు ఉన్న జ్ఞానం అన్నీ అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. కష్టపడితే ఎదగడం ఖాయం. కానీ తొందరపాటు, అసూయ ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని కష్టాల్లోకి నెట్టేస్తాయి.
నీతి: పక్కవారిని చూసి ప్రేరణ పొందాలి. కానీ వారిలా ఒక్కసారిగా మారాలని తొందరపడకూడదు. అవగాహనతో, సహనంతో కృషి చేస్తే ఏదో రోజు నిజమైన విజయం మీ సొంతమవుతుంది.