Unique Water Cave Temple: గొంతు వరకు నీళ్లలో నడిస్తేనే నరసింహ స్వామి దర్శనం! ఈ టెంపుల్ చాలా స్పెషల్ !

Published : May 11, 2026, 07:33 PM IST

Unique Water Cave Temple: కర్ణాటకలోని బీదర్ సమీపంలో ఉన్న ఝర్నీ నరసింహ స్వామి ఆలయం ఒక అద్భుతం. 300 మీటర్ల పొడవున్న నీటి గుహలో నడుచుకుంటూ వెళ్తేనే ఇక్కడ స్వామివారి దర్శనం కలుగుతుంది. ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఈ గుహలో 300 మీటర్లు నడిస్తేనే దేవుడు కనిపిస్తాడు.. ఎక్కడో తెలుసా?

భారతదేశం అంటేనే ఆలయాలకు నిలయం. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినవి అయితే, మరికొన్ని అత్యంత అందమైనవి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయం మాత్రం వీటన్నిటికంటే భిన్నం. ఇది కేవలం భక్తికి సంబంధించింది మాత్రమే కాదు, ఒక గొప్ప సాహసయాత్ర అని చెప్పాలి. కర్ణాటకలోని బీదర్ సమీపంలో ఉన్న ఝర్నీ నరసింహ స్వామి ఆలయం (Jharni Narasimha Swamy Temple) భక్తులకు ఒక వింతైన అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ దేవుడిని చూడాలంటే గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు, మెట్లు ఎక్కాల్సిన పని అంతకంటే లేదు. మరి దర్శనం ఎలా అంటే.. గొంతు వరకు ఉండే నీటిలో 300 మీటర్ల దూరం గుహలో నడుచుకుంటూ వెళ్లాలి.

25
అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది?

కర్ణాటకలోని బీదర్ పట్టణానికి కేవలం 4.8 కిలోమీటర్ల దూరంలో ఈ అద్భుతమైన గుహ దేవాలయం ఉంది. దీనిని స్థానికంగా "వాటర్ కేవ్ టెంపుల్" అని కూడా పిలుస్తారు. మణిచూల పర్వత శ్రేణుల్లోని ఒక సహజ సిద్ధమైన గుహలో ఈ ఆలయం వెలసింది. పురాణ గాథలు, సాహసయాత్రలు, భూగర్భ జలాల వింతలు.. ఇలా అన్నీ కలిసిన ఒక ప్యాకేజీలా ఈ ప్రదేశం ఉంటుంది.

35
విష్ణుమూర్తి అవతారమైన నరసింహ స్వామి కొలువైన ఆలయం

విష్ణుమూర్తి అవతారమైన నరసింహ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. గర్భాలయంలో ఉన్న స్వామివారిని చేరుకోవాలంటే సుమారు 4 నుంచి 5 అడుగుల లోతున్న నీటి గుహ గుండా ప్రయాణించాలి. పొట్టిగా ఉన్న వారికైతే నీళ్లు గొంతు వరకు, కొన్నిసార్లు మెడ వరకు వస్తాయి. చీకటిగా ఉండే ఆ గుహలో నడుస్తుంటే గోడల మీద గబ్బిలాలు వేలాడుతూ కనిపిస్తాయి. భయం వేసినా, భక్తులు మాత్రం "గోవిందా.. నరసింహ హరి" అంటూ నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతారు. ఆ నీటిలో 300 మీటర్ల ప్రయాణం ముగిశాక, గుహ చివరన స్వయంభూవుగా వెలసిన నరసింహ స్వామి విగ్రహం కనిపిస్తుంది.

45
జరాసురుడి కోరిక.. చర్మ వ్యాధులను నయం చేసే నీరు

పురాణాల ప్రకారం.. హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత ప్రహ్లాదుడిని రక్షించేందుకు నరసింహ స్వామి ఈ గుహలోకి వచ్చారట. అక్కడ శివ భక్తుడైన జరాసురుడు అనే రాక్షసుడిని స్వామి సంహరించారు. చనిపోయే ముందు జరాసురుడు స్వామివారిని ఒక కోరిక కోరాడట. "స్వామీ! మీరు ఈ గుహలోనే ఉండి భక్తులను ఆశీర్వదించాలి" అని వేడుకున్నాడు. అందుకే స్వామివారు అక్కడ కొలువుదీరారని, ఆ రాక్షసుడి పేరు మీదనే దీనికి ఝర్నీ (నీటి ప్రవాహం) అనే పేరు వచ్చిందని చెబుతారు. నరసింహ స్వామి పక్కనే ఒక శివలింగం కూడా ఉంటుంది, ఇది ఆ రాక్షసుడు పూజించిన లింగమని భక్తుల నమ్మకం. ఇక ఈ గుహలో ప్రవహించే నీటిలో గంధకం ఉంటుంది. ఇందులో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు తగ్గుతాయని, సంతానం లేని వారికి ఫలితం ఉంటుందని నమ్ముతారు.

55
ఎప్పటికీ ఎండిపోని నీటి ఊట.. ఎలా వెళ్లాలి?

ఈ గుహలోని నీరు ఎప్పుడూ ఎండిపోదు. శాస్త్రవేత్తల ప్రకారం బీదర్ ప్రాంతంలోని లాటరైట్ రాతి పొరల వల్ల భూగర్భ జలాలు నిరంతరం గుహలోకి ఊటలా వస్తుంటాయి.

• ఎలా వెళ్లాలి?: హైదరాబాద్ నుంచి బీదర్ సుమారు 120-140 కి.మీ దూరంలో ఉంటుంది. కార్లో వెళ్తే 3 గంటల్లో చేరుకోవచ్చు.

• రైలు/విమానం: బీదర్ రైల్వే స్టేషన్ ఆలయానికి 5 కి.మీ దూరంలో ఉండగా, బీదర్ ఎయిర్‌పోర్ట్ 10 కి.మీ దూరంలో ఉంది.

ఆలయం లోపలికి వెళ్తే బట్టలు తడిసిపోతాయి కాబట్టి అదనపు దుస్తులు తీసుకెళ్లండి. విలువైన వస్తువులు బయటే ఉంచండి. నరసింహ జయంతి సమయంలో ఇక్కడ భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా భక్తికి సాహసాన్ని జోడించి చేసే ఈ యాత్ర ప్రతి ఒక్కరికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే అనుభవం అనడంలో సందేహం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories