మన పూజ గదిలో కనిపించే లక్ష్మీ దేవి, రాముడు, శివుడు పటాలను చూడండి. వారి ముఖాలకు ఆ రూపాలను ఇచ్చింది ఎవరో తెలుసా? దేవుళ్లను చూసింది ఎవరూ లేరు.. కానీ వారిని పూజించేందుకు ఒక రూపం ఉండాలి కనుక ఒక గొప్ప చిత్రకారుడు మన దేవుళ్లకు తొలిసారి రూపాన్ని ఇచ్చారు.
మనం నిత్యం పూజించే లక్ష్మీదేవి, సరస్వతీదేవి,రాముడు, కృష్ణుల రూపాలు ఇప్పుడు మనం ఫోటోల రూపంలో చూడగలుస్తున్నాం. కానీ ఒకప్పుడు వారి రూపాలు ఎలా ఉంటాయో తెలియదు. విగ్రహాలనే పూజించేవారు. చెట్లనే అమ్మవారిగా కొలిచేవారు. మన దేవతలకు సజీవమైన అందమైన ముఖ రూపాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిపిన ఘనత ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మకే దక్కుతుంది. కేవలం ఐదేళ్ల వయసులోనే ఇంటి గోడలపై సుద్దముక్కలతో బొమ్మలు గీయడం ప్రారంభించారు రవివర్మ. తన ప్రతిభతో భారతీయ చిత్రకళా రంగంలో విప్లవంలా మారారు. ఆయనలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించిన కుటుంబ సభ్యులు తిరువనంతపురం రాజభవనానికి పంపించారు. అక్కడ ఆయన రామస్వామి నాయుడు వద్ద వాటర్ కలర్ మెళకువలు, డచ్ కళాకారుడు థియోడర్ జెన్సన్ వద్ద యూరోపియన్ ఆయిల్ పెయింటింగ్ పద్ధతులను నేర్చుకున్నారు.
23
మొదట్లో ఇబ్బందులు
భారతీయ ఇతిహాసాలు, పురాణాలలోని పాత్రలకు పాశ్చాత్య రియలిస్టిక్ ఆయిల్ పెయింటింగ్ శైలిని జోడించి దేవతలకు రూపాన్ని ఇవ్వడం రవివర్మకే సాధ్యమైంది. మహాభారతం, రామాయణంలోని సన్నివేశాలను, శకుంతల వంటి చారిత్రక పాత్రలను ఆయన తన కుంచెతో కాన్వాస్పై ప్రాణం పోసినట్లు చిత్రించారు. ముఖ కవళికలు, కళ్లకు కట్టినట్లు కనిపించే చీరల అంచులు, బంగారు ఆభరణాల మెరుపులు ప్రజలకు ఎంతో నచ్చేవి. ఆ కాలంలో దేవుళ్లను మానవ రూపంలో చిత్రించడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆయన గీసిన నిర్మలమైన భక్తి రూపాలు ప్రజలందరికీ నచ్చాయి. రాజా రవివర్మ గీసిన లక్ష్మి, సరస్వతి, విష్ణుమూర్తి చిత్రాలు మనదేశంలో దేవుళ్ల ప్రామాణిక స్వరూపాలుగా స్థిరపడిపోయాయి. నేడు క్యాలెండర్లలో, పూజా మందిరాల్లో మనం చూసే చిత్రాలన్నీ దాదాపుగా ఆయన ఊహాశక్తికి ప్రతిరూపాలే.
33
సామాన్యులకు దేవుళ్ల చిత్రాలు అందేలా
రవివర్మ చిత్రించిన అద్భుతమైన పెయింటింగ్స్ మొదట్లో కేవలం రాజులు, జమీందార్లు, సంపన్నుల గదులకే పరిమితమయ్యేవి. అయితే ఈ చిత్రాలు సామాన్య ప్రజల పూజా గదులకు కూడా చేరాలనే సంకల్పంతో, ట్రావెన్కోర్ దివాన్ సర్ టి. మాధవరావు సూచన మేరకు రవివర్మ 1894లో సొంతంగా ‘లిథోగ్రఫీ ప్రింటింగ్ ప్రెస్’ను స్థాపించారు. క్రోమోలిథోగ్రఫీ సాంకేతికతతో వేలాది ప్రతులను తక్కువ ధరకే ముద్రించి సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఆనాటి నుండి నేటి వరకు సుమారు 150 ఏళ్లుగా ప్రతి పల్లె, ప్రతి పట్టణంలోని ఇళ్లల్లో ఆయన ముద్రించిన దేవుళ్ల పటాలు ఉంటున్నాయి. వాటినే మనం రోజూ పూజిస్తున్నాం.