తక్కువ బడ్జెట్, అంతులేని ఆనందం..
90వ దశకంలో రూ. 10 తీసుకెళ్తే ఇంట్లో ఉన్న అన్నదమ్ములందరికీ రాఖీలు కొనేసి, మిగిలిన డబ్బులతో చాక్లెట్లు కూడా కొనేవారు. పండుగకు కొన్ని రోజుల ముందే వీధి చివర ఉండే చిన్న చిన్న షాపుల్లో తాటి ఆకుల బుట్టలు, బల్లలపై రాఖీలను పరచి అమ్మేవారు. అక్కడికి వెళ్లి బడ్జెట్లో నచ్చిన రాఖీలను ఎంచుకోవడమే ఒక పెద్ద సంబరం.
రాఖీ రోజున చెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రూపాయి లేదా రెండు రూపాయల రాఖీలు కట్టి, బొట్టు పెట్టి స్వీట్ తినిపించేవారు. ఇంట్లో అమ్మ చేసే పాయసం లేదా రవ్వ లడ్డూలే ప్రధాన పిండివంటలు. అన్నయ్యలు తమ స్తోమతను బట్టి చెల్లెళ్లకు 5, 10 లేదా 20 నోటు చేతిలో పెట్టేవారు. ఆ చిన్న నోటుతో పాటు చాక్లెట్లు పొందిన చెల్లెళ్ల ముఖంలో కనిపించే ఆనందం వెలకట్టలేనిది.
ఈ రోజుల్లో వేల రూపాయల రాఖీలు, ఖరీదైన గ్యాడ్జెట్లు గిఫ్ట్లుగా ఇస్తున్నప్పటికీ, నాటి 10 బడ్జెట్ రాఖీ పండుగలో ఉన్న ఆప్యాయత, నిజమైన బంధాల తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే.