
ప్రకృతి సృష్టించే వింతల్లో తెల్లటి అడవి జంతువులు అత్యంత అరుదైనవి. జంతువుల చర్మం, బొచ్చు, ఈకలు, కళ్ల రంగుకు కారణమయ్యే మెలనిన్ అనే పిగ్మెంట్ లోపించడం వల్ల ఈ అల్బినిజం అనే జన్యుపరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల జంతువులు పూర్తిగా తెల్లగా కనిపిస్తాయి. మరికొన్ని జంతువులు ల్యూసిస్టిక్ అనే కండిషన్ వల్ల కూడా తెల్లగా మారుతుంటాయి.
ఇందులో వాటి ఒంటి రంగు తగ్గినా, కళ్ల రంగు మాత్రం మామూలుగానే ఉంటుంది. భారతదేశంలోని కొన్ని అడవులు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలలో ఇలాంటి అసాధారణమైన తెల్లటి జంతువులు అప్పుడప్పుడు కనిపిస్తూ పర్యాటకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. మన దేశంలో ఇలాంటి అరుదైన జంతువులు కనిపించే 8 ముఖ్యమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని కాబిని అడవి అరుదైన తెల్లటి గౌర్ (భారతీయ అడవి దున్న) కారణంగా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. దీనికి ప్రజలు "గోల్డెన్ బుల్" అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ఇది నిజమైన అల్బినో కాకపోయినప్పటికీ, దీనికున్న అరుదైన రంగు కారణంగా భారతదేశంలోనే అత్యధికంగా ఫోటోలు తీసిన అడవి జంతువులలో ఒకటిగా నిలిచింది. కాబిని కేవలం ఈ తెల్లటి జంతువుకే కాదు, ఏనుగులు, చిరుతపులులు, పులులు సహా రకరకాల పక్షులకు కూడా ప్రసిద్ధి చెందింది.
కాబిని పక్కనే ఉండే నాగర్హోళె టైగర్ రిజర్వ్లో కూడా గత కొన్నేళ్లుగా అసాధారణమైన తెల్లటి గౌర్లు, తెల్లటి దుప్పులు కనిపించినట్లు రికార్డులు ఉన్నాయి. ఇక్కడి దట్టమైన అడవులు, విశాలమైన గడ్డి భూములు పర్యాటకులకు బెస్ట్ వైల్డ్లైఫ్ సఫారీ అనుభూతిని ఇస్తాయి.
కేరళలోని పెరియార్ టైగర్ రిజర్వ్లో ల్యూసిస్టిక్ కండిషన్ ఉన్న అరుదైన తెల్లటి గౌర్లు కనిపించాయి. పశ్చిమ కనుమలలోని దట్టమైన పచ్చని అడవుల మధ్య ఈ తెల్లటి జంతువులు తిరుగుతుంటే చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. పెరియార్ సరస్సులో బోట్ సఫారీ చేసేటప్పుడు ఏనుగులు, సాంబార్ దుప్పులు, అనేక పక్షి జాతులను కూడా చూడవచ్చు.
అలాగే అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో కూడా అప్పుడప్పుడు అసాధారణమైన తెల్లటి హాగ్ డీర్, ఇతర తెల్లటి జంతువులు కనిపించాయి. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన కజిరంగా, భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన వన్యప్రాణుల నివాసాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది.
రాజస్థాన్లోని కియోలాడియో నేషనల్ పార్క్లో పక్షి ప్రేమికులు అప్పుడప్పుడు తెల్లటి నెమళ్లను, తెల్లటి నీటి పక్షులను చూసినట్లు సమాచారం. పక్షులలో కనిపించే ఈ తెలుపు రంగు అంతా అల్బినో కాదు, అందులో చాలా వరకు ల్యూసిస్టిక్ లేదా ప్రత్యేకంగా పెంచబడినవి అయి ఉండవచ్చు. అయినప్పటికీ ఈ దృశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
మరోవైపు ఒడిశాలోని భీతర్కనిక నేషనల్ పార్క్ మడ అడవుల పర్యావరణ వ్యవస్థకు ప్రసిద్ధి. ఇక్కడ తెల్లటి లేదా పాక్షికంగా అల్బినో రంగులో ఉన్న తాబేళ్లు, ఇతర సరీసృపాలు కనిపించాయి. ఈ పార్క్ ఉప్పునీటి మొసళ్లు, వలస పక్షులు, తీరప్రాంత జీవవైవిధ్యానికి చాలా ఫేమస్.
రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్క్లో తెల్లటి సాంబార్ దుప్పులు, ఇతర అసాధారణ రంగులు ఉన్న జంతువుల ఫోటోలను అప్పుడప్పుడు వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. రణతంబోర్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటిగా నిలిచింది.
భారతదేశపు అత్యంత పురాతన జాతీయ ఉద్యానవనమైన ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో కూడా గత కొన్నేళ్లుగా అసాధారణమైన తెల్లటి దుప్పులు, పక్షులు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఇక్కడి వైవిధ్యమైన వాతావరణం పులులు, ఏనుగులు, చిరుతపులులు, మొసళ్లు సహా 600 కంటే ఎక్కువ పక్షి జాతులకు ఆశ్రయం కల్పిస్తోంది.