
తెలుగు సినీ చరిత్రలో కొన్ని ప్రేమకథలు కాలం మారినా ప్రేక్షకుల జ్ఞాపకాల్లోంచి చెరిగిపోవు. అలాంటి చిత్రాల్లో ‘నువ్వు నేను’ ఒకటి. ఉదయ్ కిరణ్, అనిత జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2001 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నేటికి ఈ సినిమా విడుదలై సరిగ్గా 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఒక సాధారణ యువకుడిని స్టార్గా నిలబెట్టిన ఈ చిత్రం.. అప్పటి యువత ప్రేమ, స్నేహం, కుటుంబాల మధ్య సంఘర్షణలను తెరపై ఎంతో సహజంగా చూపించి సంచలనం సృష్టించింది. ఉదయ్ కిరణ్ అనే కొత్త కుర్రాడిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అంతేకాదు ఓవర్నైట్లో మనోడిని స్టార్ని చేసింది. అదే సమయంలో స్టార్ వారసులు అయిన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లకు చెమటలు పట్టించిందీ మూవీ.
‘చిత్రం’తో దర్శకుడు తేజ, ఉదయ్ కిరణ్ కాంబినేషన్కు వచ్చిన క్రేజ్ను మరింత పెంచేలా ‘నువ్వు నేను’ రూపొందింది. తేజతో పాటు దశరథ్ కథకు రూపకల్పన చేయగా, పి. కిరణ్ నిర్మాతగా వ్యవహరించారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, ఆర్.పి. పట్నాయక్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కథలో హీరో రవి.. సంపన్న కుటుంబానికి చెందిన యువకుడు కాగా, హీరోయిన్ వసుంధర పాల వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన అమ్మాయి. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొంటూ వారి ప్రేమ సాగడం అప్పటి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాతో అనితకు అధికారికంగా హీరోయిన్గా పరిచయం జరిగింది. మరోవైపు సునీల్ పోషించిన కాలేజ్ యువకుడి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యువత, కాలేజ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకు బలంగా మారాయి. తేజ తనదైన సహజమైన టేకింగ్తో పాత్రలను, వారి భావోద్వేగాలను తెరపైకి తీసుకురావడం సినిమాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. లవ్ స్టోరీస్లో ఇదొక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది.
‘నువ్వు నేను’ విజయానికి ఆర్.పి. పట్నాయక్ సంగీతం మరో ప్రధాన కారణం. ‘ప్రియతమా ఓ ప్రియతమా’, ‘నువ్వే నువ్వే’, ‘నా గుండెల్లో’, ‘నీ కోసమే’, ‘నువ్వే నాకు ప్రాణం’ వంటి పాటలు అప్పట్లో కాసెట్ల నుంచి ప్రతి చోటా వినిపించేవి. తొమ్మిది పాటలతో రూపొందిన ఆల్బమ్ ఆ రోజుల్లో యువతను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ విజయంతో పాటు ‘నువ్వు నేను’ అవార్డుల పరంగానూ సంచలనం సృష్టించింది. ఈ సినిమా నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు తేజ, ఉత్తమ నటుడు ఉదయ్ కిరణ్, ఉత్తమ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ అవార్డులు అందుకున్నారు. అంతేకాదు ఐదు నంది అవార్డులు కూడా దక్కించుకుంది. తేజ, తనికెళ్ల భరణి, సునీల్, రసూల్ ఎల్లోర్, ఆర్.పి. పట్నాయక్లు నంది అవార్డులతో సత్కరించబడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలోని నటనకు ఉదయ్ కిరణ్ అందుకున్న ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఆయన కెరీర్లో ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. ఆయన్ని ఓవర్ నైట్ లో స్టార్ని చేసింది. ‘చిత్రం’, ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ వంటి వరుస విజయాలతో ఉదయ్ కిరణ్కు ‘హ్యాట్రిక్ హీరో’, ‘లవర్ బాయ్’ అనే ఇమేజ్ బలపడింది.
కాలం మారింది.. సినిమాలు చూసే విధానం మారింది.. కానీ ‘నువ్వు నేను’పై ప్రేక్షకుల ప్రేమ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా 90ల చివర్లో, 2000ల ప్రారంభంలో పెరిగిన తరానికి ఈ సినిమా కేవలం ఓ ప్రేమకథ కాదు—ఓ జ్ఞాపకం. ఉదయ్ కిరణ్ అమాయకమైన స్క్రీన్ ప్రెజెన్స్, తేజ టేకింగ్, ఆర్.పి. పట్నాయక్ సంగీతం కలిసి ఈ చిత్రాన్ని ఓ తరం ఫేవరెట్గా మార్చాయి. 25 ఏళ్లు పూర్తయినా ‘నువ్వు నేను’ ఇంకా కొత్తగానే అనిపిస్తుందంటే.. అది కేవలం సినిమా విజయం కాదు, ప్రేక్షకుల హృదయాల్లో సంపాదించుకున్న శాశ్వత స్థానం. ఉదయ్ కిరణ్ ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన 2014లో కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే సినిమా విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సక్సెస్తో దూసుకుపోతున్నారు. మరోవైపు మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి స్ట్రగుల్ అవుతున్నాడు. అలాగే ఎన్టీఆర్ అప్పుడప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే వీరంతా స్టార్ వారసులు. పవన్.. చిరంజీవి తమ్ముడిగా వచ్చి తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. మహేష్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్.. నందమూరి మూడోతరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు. వీరిపై ఆడియెన్స్ లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అలాంటి సమయంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా `నువ్వు నేను` అనే సినిమాతో హీరోగా పరిచయం ఓవర్ నైట్లో స్టార్ అయిపోయాడు ఉదయ్ కిరణ్. ఈ సినిమా తర్వాత మనోడి క్రేజ్, సినిమా సాధించిన రికార్డ్ లు పవన్, మహేష్, ఎన్టీఆర్లకు చెమటలు పట్టించాయంటే అతిశయోక్తి కాదు.