
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. మంచు మెహన్ బాబు నిర్మించిన ఈసినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కన్నప్ప సినిమాకోసం మంచు ఫ్యామిలీతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్, లాంటి మరికొందరు స్టార్స్ రంగంలోకి దిగారు. మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించిన ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
కానీ రిలీజ్ తరువాత అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది కన్నప్ప సినిమా. ఈక్రమంలో ఈసినిమాకు సబంధించి ట్రోల్స్, కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈక్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ ఈ సినిమాపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
‘’ఈ సినిమా సరిగ్గా తీసి ఉంటే బాగుండేది, అసలు కన్నప్ప కోసం అంత మంది స్టార్స్ ను తీసుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా తీసినా కూడా ఈసినిమా హిట్ అయ్యాయేది. కాని ఇంత మంది స్టార్స్ నటించడం వల్ల అంచనాలు పెరిగిపోయి.. వాటిని ఈసినిమా అందుకోలేకపోయింది. భక్తి సినిమాను వార్ మూవీగా తీస్తే ఎలా నడుస్తుంది, గతంలో ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి, అవన్నీ హిట్ అయినప్పుడు ఈసినిమా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయింది ‘’ అని తమ్మారెడ్డి అన్నారు. ఆయన కమెంట్స్ పై రకరకాల అభిప్రాయాలు వెల్లడికాగా తాజాగా మరోసారి ఆ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు స్టార్ ప్రొడ్యూసర్.
మంచు విష్ణు హీరోగా నటించిన మైథలాజికల్ మూవీ 'కన్నప్ప.' దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో, భారీ కాస్టింగ్ తో, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించిన ఈసినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈక్రమంలో ఈ సినిమాపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపించిన నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చకు దారి తీస్తున్నాయి.
ఈ సినిమాపై తాను చేసిన విమర్శలపై వస్తున్న ప్రతిస్పందనలకు తాజాగా ఆయన సమాధానమిచ్చారు. తమ్మారెడ్డి వ్యాఖ్యలు సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించాయి అనే కామెంట్స్ కు ఆయన క్లారిటీ ఇచ్చారు.
తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ – “కన్నప్ప సినిమాను నేను ఎనిమిదో రోజున చూసాను. దాని గురించి తొమ్మిదో రోజున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాను. పదవ రోజున ఆ సినిమా చూసిన వారందరికీ నేను చెప్పిన విషయాలు తెలిసే ఉంటాయి. అంత గ్యాప్ తర్వాత మాట్లాడటం వల్ల ఏ నష్టం జరుగుతుంది? అప్పటికే ఆ సినిమా కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి, ఇక నావల్ల ఈసినిమాకు జరిగే నష్టం ఏముంటుంది.” అని ఆయన ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యల విషయంలో మంచు మోహన్ బాబు, మంచు విష్ణులతో నేరుగా మాట్లాడిన విషయాన్ని తమ్మారెడ్డి వెల్లడించారు. “కన్నప్ప సినిమా సూపర్ హిట్ అయ్యేది. కాని మీరే ఆ సినిమాను యావరేజ్ సినిమాగా మార్చారనే మాట నేరుగా మోహన్ బాబుగారికీ, విష్ణుకీ చెప్పాను. పెద్ద స్టార్ కాస్ట్ లేకున్నా, సరైన దిశలో తీసుంటే సినిమా నడిచేది. ఈ విషయాన్ని మోహన్ బాబుకు నేనే ఫోన్ చేసి నేరుగా చెప్పాను. మోహన్ బాబుగారికి డైరెక్షన్పై మంచి పట్టు ఉంది. మీరు పట్టించుకుని ఉంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదు అని చెప్పాను'' అని భరద్వాజ్ అన్నారు.
ఇక కన్నప్ప సినమాపై మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి. ఈసినిమాలో శివపార్వతుల పాత్రలలో నటించిన అక్షయ్ కుమార్ , కాజల్ అగర్వాల్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వాళ్లు శివపార్వతులుగా వెకిలిగా ఉన్నారు. శివుడే సరిగ్గా ఉండకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన స్థానంలో ఒక అనామకుడిని పెట్టినా బాగుండేది. శివపార్వతులుగా వాళ్లిద్దరిని తీసుకోవడం వల్ల పెట్టిన ప్రతి రూపాయి నష్టమే” అని అన్నారు.
“మనవాళ్లు తప్పు చేస్తుంటే తప్పు అని చెప్పకపోతే ఎలా? అలా చెప్పకపోతే ఇలానే మరో సినిమా తీస్తారు. అప్పుడు నష్టపోతారు కదా'' అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు.