
కలెక్షన్ కింగ్, విలక్షణ నటుడు మోహన్ బాబు అంటే అందరికి ఓ భయం ఉంటుంది. ఆయన సెట్లో కొడతాడు అని, టైమ్కి రాకపోతే ఆర్టిస్ట్ లను కూడా కొడతాడనే కామెంట్ చాలా కాలంగా ఉంది. అదే సమయంలో ఆయన భోళా మనిషి అని, మనసులో ఏది ఉంచుకోరని మరికొందరు చెబుతారు. టైమ్ సెన్స్ విషయంలోనే మోహన్ బాబు కఠినంగా ఉంటారని, కానీ నచ్చితే బాగా చూసుకుంటారని అంటుంటారు. ఇదే విషయంపై సీనియర్ దర్శకుడు బి గోపాల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మోహన్ బాబు టైమ్ సెన్స్ మాత్రమే ఫాలో అవుతారని, టైమ్కి షూటింగ్ జరగకపోతేనే ఆయన కోప్పడతాడు, తప్పితే మిగిలిన విషయాల్లో ఆయన పట్టించుకోరని తెలిపారు బి గోపాల్. అదే సమయంలో `అసెంబ్లీ రౌడీ` సినిమా సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటనని పంచుకున్నారు. మోహన్ బాబు మూవీలో బాత్ రూమ్ సీన్ చేసేందుకు నో చెప్పిందట. తాను ఆ డ్రెస్ వేసుకోనని కన్నీళ్లు పెట్టుకుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి అందాల తార దివ్యభారతి.
దివ్య భారతి తమిళంలో `నీల పెన్నీ` అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత `బొబ్బిలి రాజా`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రానికి దర్శకుడు బి గోపాల్. అనంతరం ఆయన `అసెంబ్లీ రౌడీ` చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్ బాబు హీరో. ఇది తమిళంలో వచ్చిన ఓ మూవీకి రీమేక్. ఈ సినిమాలో దివ్య భారతిని హీరోయిన్గా తీసుకున్నారు. `బొబ్బిలి రాజా` మూవీతో గ్లామర్ హీరోయిన్గా దివ్యభారతికి మంచి పేరు వచ్చింది. దీంతో ఈ సినిమాలో కూడా ఆమెని గ్లామర్గా చూపించాలనుకున్నారు. కానీ కథలో ఆ స్కోప్ లేదు.
ఇందులో ఓ బాత్ రూమ్ సీన్ ఉంది. అందులో హీరోయిన్ బాత్ రూమ్ డ్రెస్లో కనిపించాలి. కాస్త మోకాళ్ల పైకి ఉండే డ్రెస్లో ఉండాలి. అయితే ఆ సీన్ చేసేందుకు దివ్య భారతి నో చెప్పిందట. ఆ డ్రెస్ వేసుకోను అని మొండికేసిందట. షాట్ రెడీ అయ్యింది. మోహన్ బాబు వచ్చే టైమ్ అయ్యింది. కానీ హీరోయిన్ ఎంతకూ రావడం లేదు. ఏమైందని అడిగితే ఆమె ఈ సీన్ చేయను, డ్రెస్ వేసుకోను అంటుందని అసిస్టెంట్లు చెప్పారు. దర్శకుడు బి గోపాల్కి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. వణికిపోయాడు. ఇలా అయితే కష్టం, మోహన్ బాబుకి విషయం తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని చెప్పి ఏకంగా ఆమె వద్దకు వెళ్లారు గోపాల్. డైరెక్టర్ వెళ్లేసరికి ఆమె ఏడుస్తూ కనిపించిందట. తాను చేయనని చెప్పిందట. సీన్ చేయనంటే ఎలా అని చెప్పి, వాళ్ల అమ్మని కన్విన్స్ చేశారట దర్శకుడు. ఎట్టకేలకు వాళ్ల అమ్మ కన్విన్స్ అయ్యింది. ఎలాగోలా దివ్య భారతిని ఒప్పించిందట. అలా వచ్చి రావడంతోనే షాట్ తీశామని, త్వరగానే షూటింగ్ అయ్యిందని, ఆ సీన్ కూడా బాగా వచ్చిందని తెలిపారు బి గోపాల్. కానీ ఆమెని సీన్ చేసే వరకు తమకు టెన్షన్ తప్పలేదన్నారు. ట్యాగ్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
మోహన్ బాబు, దివ్య భారతి జంటగా, బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన `అసెంబ్లీ రౌడీ` పెద్ద సూపర్ హిట్ అయ్యింది. మోహన్ బాబు కెరీర్లోనే ఇదొక మైలు రాయిలాంటి మూవీగా నిలిచింది. ఇది తమిళంలో వచ్చిన `వేలై కిడైచుడుచు` మూవీకి రీమేక్. ఇక దివ్య భారతి తెలుగులో `బొబ్బిలి రాజా`, `అసెంబ్లీ రౌడీ`తోపాటు `ధర్మక్షేత్రం`, `చిట్టెమ్మ మొగుడు`, `తొలిముద్దు` చిత్రాల్లో నటించింది. తెలుగులో కంటే బాలీవుడ్లో ఎక్కువ సినిమాలు చేసి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం మూడేళ్లలోనే 22 మూవీస్లో నటించింది. ఒక్కసారిగా బాలీవుడ్ని షేక్ చేసింది. అంతలోనే ఆమె కన్నుమూసింది. కేవలం 19ఏళ్ల వయసులోనే ఆమె మరణించడం విషాదకరం. అయితే ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. ఆమె బాల్కనీ నుంచి కింద పడిపోయి చనిపోయింది. తనే పడిపోయిందా? ఎవరైనా హత్య చేశారా? అనేది మిస్టరీగా మారింది.