
`కేజీఎఫ్ 2` సంచలనం తర్వాత రాకింగ్ స్టార్ యష్ కొత్త సినిమాల విషయంలో చాలా సెలక్టీవ్గా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన `టాక్సిక్` అనే మూవీలో నటిస్తున్నారు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ముంబాయిలో జరుగుతుంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పనిచేస్తున్నారు.
`జాన్ విక్`, `ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్`, `డే షిఫ్ట్` వంటి హాలీవుడ్ సినిమాలు, సిరీస్లకు పనిచేసిన జెజె పెర్రీ `టాక్సిక్` చిత్రానికి పనిచేస్తుండటం విశేషం. ముంబాయిలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. దాదాపు 45 రోజులపాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ని చిత్రీకరిస్తున్నారట. దీనికి జెజె పెర్రీ యాక్షన్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. అయితే అంతకు ముందే యాక్షన్స్ కి ఇతర దేశాల టెక్నీకల్ టీమ్ని తీసుకున్నారు పెర్రీ, కానీ ఇప్పుడు ఆయన స్థానిక యాక్షన్ స్టంట్ మాస్టర్లతో కలిసి ఈ భారీ యాక్షన్స్ ని కంపోజ్ చేయడం విశేషం.
దీనిపై పెర్రీ స్పందిస్తూ, స్థానిక యాక్షన్ అసిస్టెంట్లలో చాలా తపన, కసి, టాలెంట్ దాగి ఉంది. వారి పట్టుదల తనని అబ్బురపరిచింది. సవాళ్లని స్వీకరించే వారి మనస్తత్వం తనని ఎంతగానో ఆకట్టుకుంది. అదే సమయంలో ఇక్కడే మంచి ప్రతిభ గల నిపుణులు ఉన్నారు. ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు ఉన్నారు. వీరితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది` అని అన్నారు పెర్రీ. దీనికోసం హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్ ని కంపోజ్ చేస్తున్నారట. యష్తోపాటు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సమక్షంలోనే ఈ యాక్షన్స్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఇవి సినిమాకే హైలైట్గా నిలుస్తాయని టీమ్ చెబుతోంది. అయితే ముంబయిలో వర్షాలు కురుస్తున్నా, వాటిని లెక్క చేయకుండా టీమ్ షూటింగ్ చేస్తుండటం విశేషం.
ఈ మూవీకి కన్నడతోపాటు ఇంగ్లీష్ భాషలో ఏక కాలంలో తెరకెక్కిస్తున్నారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లో డబ్ చేయబోతున్నారు. పీరియడ్ గ్యాంగ్స్టర్ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో యష్ ఓ గ్యాంగ్ స్టర్గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచింది. ఇందులో యష్ ఎంట్రీ అదిరిపోయింది. పబ్ లోకి యష్ స్టయిల్గా ఎంట్రీ ఇచ్చిన తీరు వాహ్ అనిపించేలా ఉంది. అదే సమయంలో చాలా స్టయిలీష్గా ఉంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాంస్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై నిర్మాత వెంకట్ కే నారాయణతో కలిసి యష్ సుమారు రూ.200కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార, కియారా అద్వానా, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 19న విడుదల చేయనున్నట్టు టీమ్ వెల్లడించారు.