
హీరో బాలకృష్ణపై ఇండస్ట్రీలో, బయట భిన్నమైన అభిప్రాయాలున్నాయి. ఆయన కోపం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. అందరిలోనూ తిడతారని, తనకు ఇబ్బంది కలిగిస్తే కొడతాడని అంటారు. కొన్ని ప్రెస్ మీట్లలో అభిమానులనే కొట్టిన సందర్భాలున్నాయి. ఆయన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదంటుంటారు. కానీ ఆయన్ని దగ్గరగా చూసిన వాళ్లు మాత్రం బాలయ్య భోళాశంకరుడు, ఏదున్నా మొహం మీదే అంటారు, మనసులో ఏది పెట్టుకోరు అంటారు. ఇక సినిమా సెట్లో బాగా జోవియల్గా ఉంటారని, జోకులేస్తూ నవ్విస్తుంటారని, సెట్లో బాలయ్య ఉంటే సందడి వాతావరణం ఉంటుందని చెబుతుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. కానీ బాలయ్య అవేవీ పట్టించుకోరు. తన పని తాను చేసుకుంటూ వెళ్తారు.
అయితే మూప్పై ఏళ్ల క్రితం బాలయ్య చేసిన రచ్చ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక సినిమా సెట్లోకి వెళ్లి మరీ గొడవ చేశారట. దర్శకుడుకి అందరి ముందు వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు ఆ సినిమా కోసం కాసేపు తానే లైట్ బాయ్గా మారిపోయారట. అప్పట్లో ఇది పెద్ద రచ్చ అయ్యింది. మరి ఇంతకి ఏమైందనేది చూస్తే. బాలయ్య ప్రారంభంలో ఎక్కువగా తన తండ్రి సినిమాల్లోనే నటించారు. సొంతంగా హీరోగా నటించేందుకు చాలా టైమ్ పట్టింది. అయితే సోలో హీరోగా చేస్తూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా కూడా ఆయన తన తండ్రి సినిమాల షూటింగ్లకు వెళ్లేవారట. తనకు ఏమాత్రం ఖాళీ దొరికినా ఎన్టీఆర్ సినిమాల షూటింగ్లకు వెళ్లి చూడటం ఇష్టం. అలా ఓ సారి ఎన్టీఆర్ చివరి మూవీ సెట్కి వెళ్లారు బాలయ్య.
ఎన్టీఆర్ చివరగా నటించిన మూవీ `శ్రీనాథ కవి సార్వభౌముడు`. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామారావు కవి శ్రీనాథుడిగా నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ టైమ్లో ఈ మూవీ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతుంది. సాయంత్రం సెట్కి వెళ్లిన బాలయ్య కాసేపు తండ్రి షూటింగ్ని తిలకించారు. ఆ పక్కనే మరో సెట్లో శ్రీకాంత్, ఇంద్రజ నటించిన `జంతర్ మంతర్` మూవీ చిత్రీకరణ జరుగుతుంది. అలా ఆ సెట్ని చూస్తూ వెళ్లాడు బాలయ్య. ఆ సమయలో షాట్ తీస్తున్నారు. ఓ చిన్నపిల్లాడు లైట్ పట్టుకుని ఉన్నాడు. దాని బరువు మోయలేక ఇబ్బంది పడుతున్నాడు. పైగా నీరసంగా కనిపించాడు. పడిపోయేలా ఉన్నాడు. అది గమనించిన బాలయ్య వెంటనే ఆ కుర్రాడి వద్దకు వెళ్లి ఆ లైట్ తాను తీసుకుని అతన్ని పక్కన కూర్చోబెట్టారు. షాట్ అయిపోయేంత వరకు ఆ లైట్ని బాలకృష్ణనే పట్టుకున్నారు.
షాట్ అయిపోగానే బాలయ్యని గమనించిన ఆ చిత్ర దర్శకుడు పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ ని తీసుకున్నారు. దీంతో బాలయ్య కోపంతో ఊగిపోయారు. ఆ దర్శకుడిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చిన్న పిల్లాడితో పనిచేయిస్తారా అంటూ మండిపడ్డారు. పసి పిల్లలతో ఏంట్రా ఇది, రీల్ తగలబట్టేస్తా అంటూ ఆ దర్శకుడికి వార్నింగ్ ఇచ్చారు. ఉదయం నుంచి ఆ పిల్లాడు అన్నం తినకపోవడంతో బక్కచిక్కి నీరసంగా కనిపించాడు. అతనికి కడుపునిండా భోజనం పెట్టించారు బాలయ్య. అంతటితో వదిలేయలేదు.. ఆ పిల్లాడి పేరెంట్స్ ని తీసుకురావాలని స్టూడియో మేనేజర్ కి చెప్పగా, అతను వెళ్లి అరగంటలో వచ్చారు. అతని తండ్రి పక్షవాతంతో బాధపడుతున్నాడని, తల్లి మూర్చరోగంతో మంచాన పడ్డారని తెలిసింది. దీంతో చలించిపోయిన బాలయ్య వారిని తార్నాకలోని ఆసుపత్రిలో చేర్పించి వైద్యానికి అయ్యే ఖర్చు అంతా తనే భరించారట. అంతేకాదు ఆ కుర్రాడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్లో చేర్పించారు. చదువుకి అయ్యే ఖర్చు కూడా తనే భరించారట.
అలా బాలయ్య సహాయంతో చదువుకున్న ఆ కుర్రాడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. పోలీస్ జాబ్ కొట్టాడు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో బంకురా జిల్లాలో సీఐగా పనిచేస్తున్నాడట. ఇప్పటికీ బాలయ్య పుట్టిన రోజు జూన్ 10న తాను ఎక్కడున్న దగ్గర్లోని ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేస్తుంటాడట. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ బుర్రా నరసింహ తన ఫేస్ బుక్లో రాసుకొచ్చారు. ఇదిప్పుడు అందరిని కట్టిపడేస్తోంది. బాలయ్య గురించి నెగటివ్ విషయాలే ఎక్కువగా ప్రచారం చేస్తుంటారు. కానీ ఆయనలో ఎవరికీ తెలియని మంచి చాలా ఉందని ఆయన వెల్లడించడం విశేషం.
ఎన్టీఆర్ నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన బాలయ్య స్టార్ హీరోగా ఎదిగారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ నలుగురు టాప్ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన వరుసగా సక్సెస్లో ఉన్నారు. `అఖండ` నుంచి ఆయన సక్సెస్ పరంపరం కొనసాగుతోంది. `వీరసింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, `డాకు మహారాజ్` వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు `అఖండ 2`లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాన్ ఇండియా వైడ్గా సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది.