India Test Captains Records: భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. అయితే, శ్రీలంకలో భారత టెస్టు కెప్టెన్ల రికార్డులు ఎలా ఉన్నాయి? కపిల్, గంగూలీ, ధోని, విరాట్ కోహ్లీలలో నంబర్ 1 కెప్టెన్ గా నిలిచింది ఎవరు?
శ్రీలంకకు చేరుకున్న టీమిండియా: శుభ్మన్ గిల్కు కఠిన పరీక్ష
భారత క్రికెట్ జట్టు రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంకకు చేరుకుంది. ఈ సిరీస్లోని మొదటి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమ్ ఇండియా ఈ రెండు మ్యాచ్లను కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఈ పర్యటనలో భారత యువ కెప్టెన్ శుభ్మన్ గిల్కు గట్టి పరీక్ష ఎదురుకానుంది. ఆయన తొలిసారిగా టెస్టు కెప్టెన్గా శ్రీలంకలో అడుగుపెడుతున్నారు.
25
1985 నుంచి శ్రీలంక పర్యటనలు: కపిల్ దేవ్, అజహరుద్దీన్ రికార్డులు
భారత జట్టు ఇప్పటివరకు శ్రీలంకలో 8 సార్లు టెస్టు సిరీస్లు ఆడింది. టీమ్ ఇండియా మొదటిసారిగా 1985లో కపిల్ దేవ్ నాయకత్వంలో శ్రీలంకలో పర్యటించింది. రెండు మ్యాచ్ల ఆ సిరీస్లో ఒకదాంట్లో శ్రీలంక గెలవగా, మరొకటి డ్రాగా ముగిసింది. ఆ తర్వాత 8 ఏళ్లకు, అంటే 1993లో మహమ్మద్ అజహరుద్దీన్ కప్టెన్సీలో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. అజహర్ సారథ్యంలో టీమ్ ఇండియా 1-0తో సిరీస్ను గెలుచుకోగా, రెండో టెస్టు డ్రా అయింది.
35
గంగూలీ, కుంబ్లే సారథ్యంలో నిరాశ పరిచిన ఫలితాలు
విదేశీ గడ్డపై భారత్కు గెలవడం నేర్పిన గొప్ప కెప్టెన్గా సౌరవ్ గంగూలీకి పేరుంది. కానీ దాదా నాయకత్వంలో కూడా భారత్ శ్రీలంకలో టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. 2001లో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఒక మ్యాచ్ గెలవగా, శ్రీలంక రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. 2008లో అనిల్ కుంబ్లే కెప్టెన్సీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. శ్రీలంక 2-1 తేడాతో భారత్పై సిరీస్ విజయం సాధించింది.
ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 2010లో శ్రీలంక పర్యటనకు వెళ్ళింది. రెండు మ్యాచ్ల ఆ సిరీస్లో చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ లాంటి లెజెండరీ కెప్టెన్ కూడా శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోయిన కెప్టెన్ల జాబితాలో చేరాల్సి వచ్చింది.
55
కోహ్లీ శకం: శ్రీలంకలో రికార్డుల వేట
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా శ్రీలంకలో అద్భుత రికార్డు సృష్టించింది. 2015లో కోహ్లీ నాయకత్వంలో భారత్ 2-1తో సిరీస్ గెలిచింది. ఆ తర్వాత 2017లో కోహ్లీ అండ్ కంపెనీ శ్రీలంకను వారి సొంత గడ్డపైనే 3-0తో వైట్వాష్ చేసింది. కాగా, చివరిసారిగా భారత్ 2017లోనే అక్కడ టెస్ట్ సిరీస్ ఆడింది.
ఇప్పుడు మళ్ళీ 9 ఏళ్ల విరామం తర్వాత టీమ్ ఇండియా శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడుతోంది. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీలంక టర్నింగ్ ట్రాక్లపై ఈ యంగ్ టీమ్ ఇండియా ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.