
Suryakumar Yadav : ఆసియాకప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ క్యూరియాసిటీతో పాటు కాంట్రవర్సీకి కూడా దారితీసింది. ప్రతిసారీలాగే ఈసారి కూడా దాయాది దేశాల మధ్య మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. పహల్గాం ఉగ్రదాడి, తర్వాత పరిణామాలతో భారత్, పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి... ఇలాంటి సమయంలో ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ ఎందుకు అన్న ప్రశ్నలు వచ్చాయి. చాలామంది మ్యాచ్ బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఇలా హీట్ డిస్కషన్ మధ్య ఇండియా-పాకిస్థాన్ జట్లు దుబాయ్ వేదికన తలపడ్డాయి... ఇందులో మరోసారి ఇండియాదే పైచేయిగా నిలిచింది. టీమ్ ఇండియా అద్భుత ఆటతీరుతో పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఆటతోనే కాదు మైదానంలో వ్యవహరించిన తీరుతోనూ అభిమానుల మనసులు గెలుచుకున్నారు.
స్వయంగా అభిమానులే వద్దంటున్నా పాకిస్థాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడింది టీమిండియా... దీంతో ఇండియన్ క్రికెటర్స్ కు ఇబ్బందులు తప్పవని అందరూ భావించారు. కానీ మ్యా,చ్ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది... పాక్ ను చిత్తుగా ఓడించడమే కాదు మైదానంలోనే పాక్ క్రికెటర్ల పరువుతీశాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా మీరు అర్హులు కారంటూ యావత్ ప్రపంచం చూస్తుండగానే పాకిస్థాన్ తగిన బుద్ది చెప్పాడు. ఇలా సూర్యకుమార్ వ్యవహరించిన తీరు మ్యాచ్ వద్దన్న అభిమానులతోనే ప్రశంసలు కురిపిస్తోంది... ఇది కదా ప్రపంచానికి పాక్ స్థానమేంటో చూపించిన తీరు అంటూ కెప్టెన్ ను కొనియాడుతున్నారు.
మైదానంలో అడుగుపెట్టింది మొదలు మైదానాన్ని వీడేవరకు పాకిస్థాన్ క్రికెటర్లను అసలు మనుషులుగానే చూడలేడు సూర్యకుమార్ యాదవ్. టాస్ కోసం మైదానంలోకి వచ్చిన అతడు తన పని చూసుకుని వెళ్లిపోయాడు... టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. అతడు షేక్ ఇచ్చేందుకు ప్రయత్నించేలోపే సూర్యకుమార్ అక్కడినుండి వెళ్లిపోయారు. దీన్నిబట్టే పాక్ తో క్రికెట్ ఆడేందుకు తమకు ఇష్టం లేదు... కానీ ఐసిసి టోర్నీలో ఆడక తప్పడంలేదనే సందేశాన్ని కోపంతో రగిలిపోతున్న భారత అభిమానులకు అందించారు.
పాక్ పై విజయం తర్వాత కూడా టీమిండియా కెప్టెన్ పాకిస్థాన్ ఆటగాళ్ళకు దూరంగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ సిక్సర్ కొట్టాక శివమ్ దూబేతో కలిసి నేరుగా పెవిలియన్కి వెళ్లిపోయారు. పాక్ టీమ్, అంపైర్లు, సిబ్బంది హ్యాండ్షేక్ కోసం ఎదురు చూసినా టీమ్ ఇండియా క్రికెటర్లు రాలేదు... ఎంతసేపు ఎదురుచూసినా వాళ్లు రాకపోవడంతో పాక్ క్రికెటర్లు కూడా మైదానాన్ని వీడారు. ఇలా ప్రపంచమంతా చూస్తుండగానే పాకిస్థాన్ కు తగినబుద్ది చెప్పింది టీమిండియా.
పాకిస్థాన్ పై అద్భుత విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మాటలతో అభిమానుల మనసులు గెలుచుకున్నారు. “ఈ విజయం నాకు పర్ఫెక్ట్ రిటర్న్ గిఫ్ట్. ఎప్పటి నుంచో చివరి వరకు బ్యాటింగ్ చేయాలని అనుకున్నాను. ఆ బాక్స్ను ఇప్పుడు టిక్ చేశాను” అని అన్నారు.
ఇక పహల్గాం ఉగ్రదాడి గురించి సూర్యకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. "మేము పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం. మేము మా సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. చాలా ధైర్యాన్ని చూపించిన మన సాయుధ దళాలందరికీ ఈరోజు విజయాన్ని అంకితం చేయాలనుకుంటున్నాము. వారు మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాం. పహల్గాం బాధిత కుటుంబాలు, మన జవాన్లు ముఖాల్లో చిరునవ్వు తెచ్చేందుకు ఎప్పుడు అవకాశం వచ్చినా మేము మైదానంలో మరింత కృషి చేస్తాం. భవిష్యత్తులోనూ వారిని గర్వపడేలా చేస్తాం" అని సూర్యకుమార్ అన్నారు. పహల్గాం బాధితులకు, సైన్యానికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నామని సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
పాక్ కోచ్, మాజీ క్రికెటర్లు భారత్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ క్రీడాస్ఫూర్తి మర్చిపోయిందని అన్నారు. హ్యాండ్షేక్ కోసం ఎదురు చూసినా భారత ఆటగాళ్లు రాలేదని బాధపడ్డారు. కానీ భారతీయులు మాత్రం టీమ్ ఇండియా చేసింది కరెక్టే అంటున్నారు. ఉగ్రవాదులకు సహాయం చేసే, దాడులు చేసే దేశంతో హ్యాండ్షేక్ ఇవ్వడం తప్పని, భారత్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని అంటున్నారు. పాకిస్థాన్ స్థానమేంటో ఈ ఒక్క చర్యతో ప్రపంచానికి భారత్ తెలియజేసిందని అంటున్నారు.
మ్యాచ్ జరుగుతున్నంతసేపు పాక్ ప్లేయర్లతో భారత ఆటగాళ్లు మాట్లాడలేదు… కనీసం వారిపైపు చూడటానికి కూడా ప్రయత్నించలేదు. భారత్ తీరు చూసి పాక్ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. భారత ఆటగాళ్ళతో మాట్లాడేందుకు కొందరు పాక్ క్రికెటర్లు ప్రయత్నించారు... కానీ మన ఆటగాళ్లు స్పందించలేదు. ఇలా పాకిస్థాన్ క్రికెటర్లకే కాదు ఆ దేశానికి అద్భుతమైన ఆటతోనే కాదు తమ చర్యలతోనూ బుద్దిచెప్పారు సూర్య ఆండ్ టీం. ఇలా పాకిస్థాన్ తో ఆడేందుకు తమకు ఏమాత్రం ఇష్టంలేదని భారత జట్టు చెప్పకనే చెప్పింది.