
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం (సెప్టెంబర్ 22) విచారించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటిశ్వరసింగ్లతో కూడిన బెంచ్, విమాన ప్రమాదాల విచారణ సంస్థ అయిన ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. పైలట్ తప్పిదం కారణమని సూచించిన ప్రాథమిక నివేదికను ‘సెలెక్టివ్’గా విడుదల చేయడం బాధ్యతారాహిత్యం అని కోర్టు అభివర్ణించింది. పూర్తి విచారణ పూర్తికాకముందే ఇలాంటి సమాచారం విడుదల చేయడం ప్రజల్లో తప్పు అభిప్రాయం కలిగించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కేసులో పిటిషన్ వేసింది. మాజీ పైలట్ అమిత్ సింగ్ నేతృత్వంలోని ఈ ఎన్జీవో, కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరగాలని డిమాండ్ చేసింది. పిటిషన్లో, AAIB ప్రాథమిక నివేదిక 2017 విమాన ప్రమాదాల విచారణ నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని, పూర్తి వాస్తవ డేటా వెల్లడించాల్సిన బాధ్యతను పాటించలేదని ఆరోపించింది.
కోర్టు కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ (DGCA)లకు నోటీసులు జారీ చేసింది. నిపుణులతో న్యాయంగా, వేగంగా, పాక్షికత లేకుండా విచారణ జరగాల్సిన అవసరాన్ని బెంచ్ స్పష్టం చేసింది. “ఇలాంటి దుర్ఘటనలను పోటీ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. నివేదికలు పూర్తయ్యేవరకు గోప్యంగా ఉంచాలి” అని కోర్టు వ్యాఖ్యానించింది.
AAIB ప్రాథమిక నివేదికలో, విమానం టేకాఫ్ అయిన మూడు సెకన్లలోనే ఇంధన నియంత్రణ స్విచ్లు ‘కట్ ఆఫ్’ స్థితిలోకి మారాయని, ఫలితంగా రెండు ఇంజిన్లు ఆగిపోయాయని తెలిపింది. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఒక పైలట్ “ఎందుకు ఆపేశాడు?” అని ప్రశ్నించగా, మరొక పైలట్ “నేను ఆపలేదు” అని సమాధానం ఇచ్చిన ఆడియో కూడా ఉందని పేర్కొంది. అయితే ఇది ఉద్దేశపూర్వకమా లేక సాంకేతిక లోపమా అన్నది నివేదిక స్పష్టంగా చెప్పలేదు.
పిటిషన్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్, విచారణ బృందం కూర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదుగురు సభ్యుల బృందంలో ముగ్గురు డీజీసీఏ అధికారులే ఉండటంతో ప్రయోజన సంఘర్షణ ఉందని వాదించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్ “ఉన్నతాధికారులు బృందంలో ఉండటమంటే పాక్షికత అని అనుకోవడం తప్పు” అని వ్యాఖ్యానించారు.
అలాగే, పూర్తి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) రీడౌట్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) పూర్తి ట్రాన్స్క్రిప్ట్ టైమ్స్టాంప్లతో సహా, ఎలక్ట్రానిక్ ఎయిర్క్రాఫ్ట్ ఫాల్ట్ రికార్డింగ్ (EAFR) డేటా వంటివి దాచిపెట్టారని పిటిషన్ ఆరోపించింది. బదులుగా, కాక్పిట్ సంభాషణల నుండి కొంతభాగాన్ని మాత్రమే నివేదికలో ఉంచడం వల్ల పైలట్ తప్పిదం వైపు దృష్టి మళ్లించినట్టు వాదనలు వినిపించారు.
2025 జూన్ 12న జరిగిన ఈ ప్రమాదంలో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 (ఫ్లైట్ AI171) లండన్ గ్యాట్విక్ వైపు బయలుదేరి కొద్ది సేపటికే అహ్మదాబాద్లోని మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్పై కూలిపోయింది. ఈ ఘటనలో 265 మంది మృతి చెందారు. వీరిలో 241 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, నేలపై ఉన్న 19 మంది వ్యక్తులు ఉన్నారు. మరణించినవారిలో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్ పౌరులు, 1 కెనడా పౌరుడు, 12 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ దుర్ఘటనలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. బ్రిటన్కు చెందిన విశ్వేష్కుమార్ రమేష్ అనే ప్రయాణికుడు మాత్రమే ఈ ప్రమాదంలో బతికారు. పిటిషన్లో “ఇది ఒక్క ప్రమాదం గురించే కాదు. విమానయానంలో ప్రజల విశ్వాసాన్ని కాపాడటం కూడా ముఖ్యం. సెలెక్టివ్ లేదా పాక్షిక విచారణతో ప్రజల నమ్మకం కోల్పోతుంది. భవిష్యత్ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి” అని ఎన్జీవో వాదించింది.