Shubman Gill: పాకిస్తాన్ లెజెండ్ రికార్డును గురిపెట్టిన శుభ్‌మన్ గిల్.. మాంచెస్టర్ లో 19 ఏళ్ల రికార్డు బద్దలు !

Published : Jul 20, 2025, 09:00 PM IST

Shubman Gill: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతో దుమ్మురేపుతున్నాడు. గిల్ మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే 4వ టెస్ట్‌లో మరో 25 పరుగులు చేస్తే పాక్ దిగ్గజం రికార్డును బద్దలు కొడతాడు.

PREV
16
మాంచెస్టర్ టెస్టు: శుభ్‌మాన్ గిల్ కొత్త చరిత్ర

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం (జూలై 23) నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో భారత జట్టు నాల్గవ టెస్టు ఆడనుంది. అంతకుముందు, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్‌లో భారత్ గెలుపు దగ్గరగా వచ్చి ఓడిపోయింది. దీంతో ఈ సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకడుగు వేసింది. సిరీస్ గెలుపుపై ఆశలు నిలవాలంటే భారత జట్టుకు ఇది తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ గా మారింది. 

నాల్గవ టెస్ట్‌లో భారత్ ఓడిపోతే, ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ ను కోల్పోతుంది. అయితే, సిరీస్ లో అద్భుతమైన ఆటతో రాణిస్తున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో ఘనత సాధించనున్నాడు. మాంచేస్టర్ లో మరోసారి పరుగుల వరద పారించి లెజెండరీ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు భారత్ కు విజయాన్ని అందించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు.

26
గిల్ మరో 25 పరుగులు చేస్తే పాక్ దిగ్గజం రికార్డు బద్దలవుతుంది !

భారత్ – ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో శుభ్‌మన్ గిల్ ఇప్పటికే 101 సగటుతో 607 పరుగులు చేశాడు, అత్యధిక స్కోరు 269 పరుగులు. మాంచెస్టర్ టెస్టు మ్యాచ్‌లో గిల్ ఇంకా 25 పరుగులు చేస్తే, అతని స్కోరు 632 అవుతుంది. దీంతో ఇంగ్లాండ్‌లో ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధిస్తాడు. అలాగే, 2006లో ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై 631 పరుగులు చేసిన పాకిస్తాన్ దిగ్గజం మహ్మద్ యూసుఫ్‌ను గిల్ దాటేస్తాడు.

36
మాంచేస్టర్ లో శుభ్‌మాన్ గిల్ సాధించే రికార్డులు ఏమిటి?

మాంచెస్టర్‌తో జరిగే 4వ టెస్ట్‌లో శుభ్‌మాన్ మరో 146 పరుగులు చేస్తే, ఈ సిరీస్‌లో అతను 753 పరుగులు చేస్తాడు. ఇది భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఒక బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు అవుతుంది. 1990లో ఇంగ్లాండ్‌లో జరిగిన సిరీస్‌లో 752 పరుగులు చేసిన గ్రాహం గూచ్ రికార్డును గిల్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.

టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా యశస్వి జైస్వాల్‌ను దాటడానికి శుభ్‌మాన్ గిల్‌కు ఇంకా 107 పరుగులు కావాలి. 2024లో భారతదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో జైస్వాల్ 712 పరుగులతో ధనాధన్ నాక్ లు ఆడాడు.

46
ఇంగ్లాండ్ గడ్డపై ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ ఎవరు?

ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్. 1930లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆషెస్ సిరీస్‌లో (ఐదు టెస్టులు) ఆయన అద్భుతంగా ఆడుతూ 974 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 139.14 కావడం విశేషం. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి.

ఈ రికార్డు కేవలం ఇంగ్లాండ్‌లోనే కాదు, మొత్తం అంతర్జాతీయ క్రికెట్ ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా బ్రాడ్‌మన్ నిలిచారు. ఈ చారిత్రాత్మక రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు.

56
IND vs ENG సిరీస్: శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు సాధించిన ముఖ్యమైన రికార్డులు ఇవే

శుభ్‌మన్ గిల్ ఇప్పటికే ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. 2002లో రాహుల్ ద్రవిడ్ చేసిన 602 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. 

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గిల్.. భారత టెస్ట్ కెప్టెన్‌గా రెండో అతి చిన్న వయసులో (25 సంవత్సరాలు 298 రోజులు) డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అలాగే, టెస్ట్ క్రికెట్ లో భారత కెప్టెన్‌గా టాప్ స్కోర్ సాధించాడు. ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, 150కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కూడా గిల్ నిలిచాడు.

66
మాంచెస్టర్‌లో గిల్ భారత జట్టుకు విజయాన్ని అందిస్తాడా?

మాంచెస్టర్‌లో భారత జట్టు ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ ను కూడా గెలుచుకోలేదు. 1936 నుంచి 2014 వరకు భారత్ అక్కడ 9 టెస్టులు ఆడింది. వాటిలో నాలుగు టెస్టుల్లో ఓటమిని చవిచూసింది. మిగతా ఐదు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.

అయితే, ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ పై భారత్ భారీ అంచనాలు పెట్టుకుంది. గిల్ మాంచెస్టర్‌లో తొలి విజయాన్ని అందించి.. భారత కెప్టెన్ గా చరిత్ర సృష్టిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories