
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) పేసర్ షకీబ్ హుస్సేన్కు ఇంతకంటే గొప్ప ఐపీఎల్ అరంగేట్రం మరొకటి ఉండదేమో..! గత సోమవారం (ఏప్రిల్ 13న) హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుల్లెట్ లాంటి బంతులతో చెలరేగాడు. ఐపిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు సన్ రైజర్స్ బ్రేక్ వేసింది... ఇందులో షకీబ్ బౌలింగ్ ది కీలకపాత్ర. తన ఐపీఎల్ కెరీర్ను ఇంత అద్భుతంగా మొదలుపెడతానని అతను కూడా ఊహించి ఉండడు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోని ప్రేక్షకులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టిని ప్రఫుల్ హింగే తన తొలి ఓవర్లోనే నిప్పులు చెరిగే బౌలింగ్తో ఆకర్షించాడు. కానీ అతడితో పాటే ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేసిన షకీబ్ కూడా అదరగొట్టాడు. హింగే మాదిరిగానే షకీబ్ కూడా తొలి మ్యాచ్లోనే నాలుగు వికెట్లు తీసి హైదరాబాద్ విజయంలో అంతే ప్రభావం చూపాడు.
సన్ రైజర్స్ బౌలింగ్లో రెండో ఓవర్ వేయడానికి వచ్చిన హుస్సేన్, నాలుగో బంతికే ఫామ్లో ఉన్న ఆర్ఆర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అవుట్ చేశాడు. తన మొదటి ఓవర్లోనే తొలి ఐపీఎల్ వికెట్ తీసి రాజస్థాన్ రాయల్స్ను దెబ్బకొట్టాడు.
డొనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా భాగస్వామ్యాన్ని విడదీయడానికి SRH బౌలర్లు ఇబ్బంది పడుతున్నప్పుడు, 15వ ఓవర్లో షకీబ్ హుస్సేన్ను మళ్లీ బౌలింగ్కు దించారు. ఆ ఓవర్ చివరి బంతికి ఫెరీరాను క్లీన్ బౌల్డ్ చేసి, ప్రమాదకరంగా మారుతున్న భాగస్వామ్యాన్ని విడదీశాడు. దీంతో మ్యాచ్ మళ్లీ SRH వైపు తిరిగింది.
ఇన్నింగ్స్ 17వ ఓవర్లో తన చివరి స్పెల్ కోసం వచ్చిన సకీబ్, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్ వికెట్లను కూడా పడగొట్టాడు. దీంతో తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే నాలుగు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేశాడు. ఈ ఘనతతో ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన నాలుగో అన్క్యాప్డ్ బౌలర్గా రికార్డు సృష్టించాడు. షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే ఒకే ఐపీఎల్ మ్యాచ్లో చెరో నాలుగు వికెట్లు తీసిన నాలుగో బౌలింగ్ జోడీగా నిలిచారు. ఇది సన్రైజర్స్ హైదరాబాద్కు ఒక కలలాంటి బౌలింగ్ ప్రదర్శన.
షకీబ్ హుస్సేన్ 2004 డిసెంబర్ 14న బీహార్లోని గోపాల్గంజ్లో పుట్టాడు. అతనిది చాలా పేద కుటుంబం... తండ్రిదండ్రులు నిరుపేద రైతు కూలీలు... రెక్కాడితే గానీ డొక్కాడని ఫ్యామిలీ. దీంతో షకీబ్ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించేందుకు క్రికెటర్ గా మారాడు.. విలేజ్ క్రికెట్ ఆడుతూ రోజుకు రూ.500 వరకు సంపాదించేవాడు. ఇలా కుటుంబం కోసం క్రికెటర్ గా మారిన షకీబ్ దీన్నే ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు... అయితే ఈ ప్రయాణంలో అతడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు.
ఓసారి షకీబ్ ఏడ్చేకుంటూ ఇంటికి వచ్చాడట... ఏమైందని తల్లి అడిగితే క్రికెట్ ఆడేందుకు స్పోర్ట్స్ షూస్ లేవని బాధపడ్డాడట. కొడుకు బాధను చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది.. వెంటనే తన బంగారు నగలు అమ్మి అతడికి షూస్ కొనిచ్చింది. ఇలా కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు... పేరెంట్స్ కోసం కొడుకు ఎన్నో త్యాగాలు చేశారు.
షకీబ్ తన క్రికెట్ ప్రయాణాన్ని టెన్నిస్ బాల్తో ప్రారంభించాడు. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న మొత్తాలు సంపాదించేవాడు. అతని మెంటార్స్, కోచ్ రాబిన్ సింగ్ ప్రోత్సాహంతో లెదర్ బాల్ క్రికెట్కు మారాడు. వాళ్లే అతని బౌలింగ్కు మెరుగులు దిద్ది, పోటీ క్రికెట్లో రాణించేలా తీర్చిదిద్దారు.
2021 బీహార్ క్రికెట్ లీగ్లో నిలకడగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి స్థానికంగా వార్తల్లో నిలిచాడు. ఇది అతనికి దేశవాళీ క్రికెట్లోకి దారి చూపింది. అక్టోబర్ 2022లో ఇండోర్లో ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022/23లో బీహార్ తరఫున అరంగేట్రం చేశాడు.
ఐపిఎల్ 2026 పాయింట్స్ టేబుల్ లో టాస్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ను సన్రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఓడించింది. ఇది ఈ ఐపీఎల్ 2026 సీజన్లో SRHకు రెండో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 216/6 భారీ స్కోరు చేసింది. తర్వాత బరిలోకి దిగిన RRను 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూల్చింది. ప్రఫుల్ హింగే (4/34), షకీబ్ హుస్సేన్ (4/24) చెరో నాలుగు వికెట్లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ను ముక్కలు చేశారు.
ఒక దశలో రాజస్థాన్ రాయల్స్ 3 ఓవర్లలో 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ ఆరో వికెట్కు డొనోవన్ ఫెరీరా (69), రవీంద్ర జడేజా (45) మధ్య 118 పరుగుల భాగస్వామ్యం వారి ఇన్నింగ్స్ను కాసేపు నిలబెట్టింది. అయితే SRH బౌలర్లు మళ్లీ పుంజుకుని మిగతా వికెట్లను తీసి ఘన విజయాన్ని అందించారు.
2024లో కోల్కతా నైట్ రైడర్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేయడంతో తొలి ఐపీఎల్ కాంట్రాక్ట్ అందుకున్నాడు షకీబ్. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. అయినా నిరాశపడకుండా దేశవాళీ క్రికెట్లో బాగా రాణించాడు. రంజీ ట్రోఫీ 2025/26లో, అరుణాచల్ ప్రదేశ్పై తన తొలి ఫస్ట్-క్లాస్ ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో, సన్రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో తన ఐదో మ్యాచ్లో SRH తరఫున అరంగేట్రం చేసి, రాజస్థాన్ రాయల్స్పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో వెంటనే తన ముద్ర వేశాడు.