ధోని, కోహ్లీల‌ను దాటేసి క్రిస్ గేల్ రికార్డును బ‌ద్డ‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ‌

First Published Jun 28, 2024, 3:18 PM IST

T20 World Cup 2024: 20 ప్ర‌పంచ క‌ప్ సెమీ ఫైన‌ల్లో అద్భుత‌మైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్ కు చేరింది టీమిండియా. ఈ క్ర‌మంలోనే రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు. ధోని, గేల్, కోహ్లీల రికార్డులను బ్రేక్ చేశాడు.  
 

T20 World Cup 2024 :  టీ20 ప్రపంచకప్ 2024 లో వ‌రుస విజ‌యాలతో భారత జ‌ట్టు ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఆఫ్రికా జట్టు విజయం సాధించింది. 
 

సెమీ ఫైన‌ల్ మ్యాచ్ లో భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ ఇంగ్లండ్‌పై 39 బంతుల్లో 57 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. రోహిత్ తన ఇన్నింగ్స్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. 
 

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ చరిత్రలో 50 సిక్సర్లు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. అతని పేరిట 33 సిక్సర్లు ఉన్నాయి. యువరాజ్ సింగ్ కూడా 33 సిక్సర్లు కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ పేరిట 21 సిక్సర్లు ఉన్నాయి.

భారత్ తరఫున ఒక సిరీస్ లేదా టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో కూడా రోహిత్ శ‌ర్మ ముందున్నాడు. రోహిత్ శర్మ వన్డే, టీ20లలో ఆధిపత్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ 31 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు 2024 టీ20 ప్రపంచకప్‌లో 15 సిక్సర్లు కొట్టాడు. ఇక టెస్టుల్లో మాత్రం యశస్వి జైస్వాల్ అగ్రస్థానంలో ఉంది. 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 24 సిక్సర్లు బాదాడు. ఇక ఐపీఎల్ లో అభిషేక్ శర్మ 42 సిక్స‌ర్ల‌తో నంబర్-1లో ఉన్నాడు. 

టీ20 ప్రపంచకప్‌లో 1200 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ 1211 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కంటే కేవలం 5 పరుగుల వెనుక హిట్ మ్యాన్ ఉన్నాడు. విరాట్ 1216 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ ఇప్పుడు తన రికార్డుకు చేరువయ్యాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే 1016 ప‌రుగుల‌తో మూడో స్థానంలో ఉండ‌గా, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 1013 పరుగులతో త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ 5000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడు. భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 12883 పరుగులు, మహేంద్ర సింగ్ ధోనీ 11207 పరుగులు, మహ్మద్ అజారుద్దీన్ 8095 పరుగులు, సౌరవ్ గంగూలీ 7643 పరుగులు చేశారు.

ఐసీసీ నాకౌట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఏకంగా 22 సిక్సర్లు బాదాడు. ఈ విషయంలో వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్‌ను దాటేశాడు. గేల్ 21 సిక్సర్లు కొట్టాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 18 సిక్సర్లు, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 15 సిక్సర్లు, న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 15 సిక్సర్లతో త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

India , Rohit sharma, ViratKohli, Hardik Pandya

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ 57 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా కూడా రోహిత్ శ‌ర్మ ఘ‌త‌న సాధించాడు. 

Latest Videos

click me!