MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరు. ఆయన కెప్టెన్సీలో భారత్ ఎన్నో విజయాలను అందుకుంది. ఇక బౌలర్లకు తన బ్యాటింగ్తో చుక్కలు చూపించే ధోని ఒక చిన్న విషయానికి భయపడతాడని మీకు తెలుసా.?
భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఉన్న అతిపెద్ద భయం గురించి చెప్పాడు. ధోని చెప్పిన ప్రకారం తనకు ఇంజెక్షన్లు, సూదులు అంటే చాలా భయమన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. “నాకు సూదులు అంటే భయం. సూదులతో సంబంధించిన ఏ పని ఉన్నా నేను దూరంగా ఉండాలనుకుంటాను,” అని ధోని నవ్వుతూ చెప్పాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న ధోని ఇలా చెప్పడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
24
న్యూజిలాండ్ టూర్లో జరిగిన ఆసక్తికర ఘటన
ఈ సందర్భంలో తన కెరీర్లో జరిగిన ఒక సంఘటనను కూడా ధోని గుర్తుచేశాడు. ఒకసారి భారత్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు తనకు తీవ్రంగా వెన్నునొప్పి వచ్చింది. ఆ సమయంలో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడలేకపోయానని ధోని తెలిపాడు. టీమ్ ఫిజియో తనను ఆసుపత్రికి తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కాన్, ఇతర పరీక్షలు చేయించారు. అన్ని పరీక్షలు చేసినా సమస్య ఏమిటో డాక్టర్లు గుర్తించలేకపోయారు. తరువాత ఫిజియో ఐసోటోప్ టెస్ట్ చేయాలని సూచించాడని ధోని వివరించాడు.
34
ముందు సరే అని తర్వాత..
మొదట్లో ఆ పరీక్ష చేయించుకోవడానికి ధోని ఒప్పుకున్నాడు. “ఇప్పటికే ఆసుపత్రికి వచ్చాం కాబట్టి పరీక్ష చేయించుకుందాం” అని చెప్పానని తెలిపాడు. కానీ ఫిజియో ఆ టెస్ట్ కోసం ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుందని చెప్పగానే తన నిర్ణయం వెంటనే మారిపోయిందని ధోని నవ్వుతూ చెప్పాడు.
ఈ ఇంటర్వ్యూలో ధోని తన కుటుంబ జీవితంపై కూడా మాట్లాడాడు. ప్రేక్షకులలో ఒక మహిళ “మైదానంలో మీరు కెప్టెన్ కూల్… ఇంట్లో కెప్టెన్ ఎవరు?” అని ప్రశ్నించిందని గుర్తు చేయగా.. దానికి ధోని చిరునవ్వుతో సమాధానం ఇస్తూ.. “ఇంట్లో కొన్ని సార్వత్రిక నిజాలు ఉంటాయి. బయట మీరు ప్రధాని అయి ఉండవచ్చు. కానీ ఇంట్లో హోం మినిస్టర్ ఎక్కువ శక్తివంతుడు,” అని చెప్పాడు. తాను ప్రపంచంతో పోరాడగలనని, ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొనగలనని కానీ తన భార్య సాక్షి తనవైపు ఉండడం చాలా ముఖ్యం అని ధోని చెప్పుకొచ్చాడు.