IPL 2026: ఈడెన్ గార్డెన్స్లో ముంబై ఇండియన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ రేసును రసవత్తరంగా మార్చేసింది. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్లేఆఫ్స్ రేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం జరిగిన 65వ లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ (KKR) 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకోవడమే కాకుండా, తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, పిచ్ పరిస్థితులను కోల్కతా బౌలర్లు అద్భుతంగా వాడుకున్నారు. ముంబై ఇండియన్స్ బ్యాటర్లను కట్టడి చేస్తూ కేకేఆర్ బౌలింగ్ యూనిట్ కలిసికట్టుగా రాణించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఈ స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
24
నరైన్ మ్యాజిక్.. ముంబై టాప్ ఆర్డర్ కొలాప్స్
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్కు పవర్ప్లేలోనే గట్టి షాక్లు తగిలాయి. కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలింది. పవర్ప్లే ముగిసేసరికి ముంబై 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వెటరన్ స్పిన్నర్ సునీల్ నరైన్ తన నయా మ్యాజిక్తో ముంబై పరుగుల వేగానికి పూర్తిగా బ్రేకులు వేశాడు.
నరైన్ 4 ఓవర్లలో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అతనికి తోడుగా సౌరభ్ దూబే, కెమరూన్ గ్రీన్, కార్తీక్ త్యాగి తలో రెండు వికెట్లతో చెలరేగడంతో ముంబై కోలుకోలేకపోయింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. బ్యాటింగ్ గ్రూప్గా తాము ఒక 20 పరుగులు తక్కువ చేశామని, పవర్ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోవడం తమ దెబ్బతీసిందని అన్నాడు. ముంబై టీమ్లో తిలక్ వర్మ, హార్దిక్ జోడీ కాసేపు క్రీజులో ఉన్నా భారీ భాగస్వామ్యాలు నమోదు కాలేదు. దీంతో ముంబై 147 పరుగులు మాత్రమే చేయగలిగింది.
34
మనీష్ పాండే క్లాస్.. రోవ్మన్ పావెల్ మాస్
148 పరుగుల సులువైన లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ చాలా వ్యూహాత్మకంగా ఇన్నింగ్స్ను కొనసాగించింది. ఓపెనర్ అజింక్యా రహానే 21 పరుగులు చేసి అవుటైనా, వన్ డౌన్లో వచ్చిన సీనియర్ బ్యాటర్ మనీష్ పాండే సూపర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో పెద్దగా అవకాశాలు రాని మనీష్ పాండే, తనకు వచ్చిన లక్కీ ఛాన్స్ను రెండు చేతులా వాడుకున్నాడు. 33 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి కేకేఆర్ ఇన్నింగ్స్కు సాలిడ్ యాంకర్ రోల్ పోషించాడు.
పరాగ్ కు తోడుగా రోవ్మన్ పావెల్ ముంబై బౌలర్లపై మాస్ అటాక్ చేశాడు. పావెల్ కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి ముంబై బౌలింగ్ డిఫెన్స్ను ముక్కలు చేశాడు. వీరిద్దరి మధ్య 4వ వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదై కేకేఆర్ను విజయానికి చేరువ చేసింది. చివర్లో రింకూ సింగ్ ఫోర్ కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, కోర్బిన్ బాష్ వికెట్లు తీసినా లాభం లేకపోయింది. మనీష్ పాండేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ప్లేఆఫ్స్ రేసు హీటెక్కింది.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిది?
ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటికే టోర్నీ నుంచి అఫీషియల్గా ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అడుగున ఉండగా, కేకేఆర్ మాత్రం ఈ రెండు పాయింట్లతో టాప్-4 రేసులోకి దూసుకొచ్చింది.
ప్రస్తుతానికి మొదటి మూడు స్థానాల్లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు నిలిచాయి. నాలుగో స్థానం కోసం రసవత్తరమైన పోటీ నెలకొంది. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో గెలిచినా మిగతా జట్ల రన్ రేట్ కీలకం కానుంది.