భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు నిలిపివేసిన ఐపిఎల్ 2025 మళ్లీ ప్రారంభం కానుంది. మే 17 శనివారం అంటే ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఆగిపోయింది అనుకున్న ఈ సీజన్ తిరిగి ప్రారంభమయ్యింది. ఇప్పటికే సగం టోర్నీ ముగిసినా ప్లేఆఫ్స్ స్థానంపై క్లారిటీ లేదు... ఇందుకోసం కొన్నిజట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకున్నాయి. మిగతా ఏడు జట్లు లీగ్ దశలో టాప్-4 స్థానం కోసం పోటీలో ఉన్నాయి.
ఐపిఎల్ 2025 లీగ్ దశలో మిగిలిన టాప్-4 స్థానాల కోసం పోటీలో ఉన్న ఏడు జట్ల ప్లేఆఫ్ అవకాశాల గురించి ఓసారి పరిశీలిద్దాం.
గుజరాత్ టైటాన్స్ :
ఐపిఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా ఆడుతోంది. గత సీజన్లో నిరాశపరిచిన ఈ జట్టు ఈసారి మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది. శుభ్మన్ గిల్, ఆశిష్ నెహ్రా కెప్టెన్-కోచ్ జోడీ జట్టును అద్భుతమైన వ్యూహం మరియు సమన్వయంతో నడిపిస్తోంది. దీంతో జిటి వరుస విజయాలు సాధిస్తోంది. టైటాన్స్ ప్రస్తుతం 8 విజయాలు మరియు 3 ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాయి, 11 మ్యాచ్లలో 16 పాయింట్లు సాధించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి ఐపిఎల్ టైటిల్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్సిబి ఐపిఎల్ టైటిల్ విన్నింగ్ కల 2008లో జరిగిన మొదటి సీజన్ నుండి వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈసారి మాత్రం ఆర్సిబి అద్భుతంగా ఆడుతోంది... ఇప్పటివరకు 11 మ్యాచ్లలో 8 మ్యాచ్లను గెలిచి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది.
పంజాబ్ కింగ్స్
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. గత ఐపిఎల్ పరాభవాన్ని మరిచేలా ఈసారి ప్రదర్శన ఉంది. 2014 ఐపిఎల్ ఫైనలిస్ట్ టీం ప్రస్తుతం 7 విజయాలు, 3 ఓటములతో 15 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్నారు.
ముంబై ఇండియన్స్
ఈ ఐపిఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు.. మొదటి ఐదు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక విజయం సాధించింది. కానీ తర్వాత పుంజుకున్న ఎంఐ వరుసగా ఆరు విజయాలతో అద్భుతమైన పునరాగమనం చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి ప్రవేశించింది. ఐదుసార్లు ఐపిఎల్ ఛాంపియన్లు ప్రస్తుతం ఏడు విజయాలు, ఐదు ఓటములతో 14 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది.
ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపిఎల్ 2025 ని అద్భుతంగా ప్రారంభించింది. మొదటి నాలుగు మ్యాచ్లను వరుసగా గెలిచి పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే అక్షర్ పటేల్ నేతృత్వంలోని జట్టు తదుపరి ఆరు మ్యాచ్లలో రెండు మ్యాచ్లను మాత్రమే గెలిచింది ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ టీం ప్లే ఆఫ్ కు చేేరే అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.
కోల్కతా నైట్ రైడర్స్
అజింక్య రహానే నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ ప్రస్తుతం ఐదు విజయాలు, ఆరు ఓటములతో 11 పాయింట్లు సాధించింది. ఐపిఎల్ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఈ టీం ఆరవ స్థానంలో ఉంది. 12 మ్యాచులాడిన ఈ టీం +0.193 నికర రన్ రేట్ కలిగి ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్
రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ ఐపిఎల్ 2025లో ప్లేఆఫ్స్కు చేరుకునే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఎల్ఎస్జి ప్రస్తుతం ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది.