
ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో 10వ మ్యాచ్లో భారత మహిళల జట్టుతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తలపడనుంది. గురువారం (అక్టోబర్ 9న) విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే జియో హాట్స్టార్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.
భారత జట్టు ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, పాకిస్తాన్పై విజయాలతో మంచి జోష్ లో ఉన్న భారత జట్టు ఇప్పుడు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. మరోవైపు, దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ చేతిలో భారీ ఓటమిని ఎదుర్కొన్న తర్వాత న్యూజిలాండ్పై అద్భుత విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది.
విశాఖలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉంటుంది. తొలి ఇన్నింగ్స్లో సగటు స్కోరు 230 పరుగులుగా ఉంది. అయితే మ్యాచ్ కొనసాగేకొద్దీ స్పిన్నర్లకు పిచ్ సహకరించే అవకాశం ఉంటుంది.
అందువల్ల మధ్య ఓవర్లలో స్పిన్ బౌలింగ్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేయడానికే ఆసక్తి చూపవచ్చు. మొత్తంగా అయితే, బ్యాటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్లు మొత్తం 33 వన్డే మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో భారత్ 20 మ్యాచ్లు గెలిచింది, దక్షిణాఫ్రికా 12 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం రాలేదు. గత ఐదు వన్డేల్లో భారత్ అన్నింటినీ గెలిచింది.
ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ 1997 డిసెంబర్ 22న జరిగింది. చివరి పోరు ఈ ఏడాది మే 7న జరగ్గా, అందులో భారత జట్టు విజయం సాధించింది. అంటే మొత్తంగా రెండు జట్ల రికార్డులు గమనిస్తే భారత జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు బలంగా కనిపిస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్ లో రాణిస్తే పరుగుల వరద ఖాయం.
దక్షిణాఫ్రికా జట్టులో తాజ్మిన్ బ్రిట్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. న్యూజిలాండ్పై 101 పరుగులతో సెంచరీ కొట్టి ప్రోటీస్ జట్టుకు విజయాన్ని అందించారు. ఆమె విశాఖ మ్యాచ్లోనూ అదే ఫామ్ కొనసాగిస్తారనే అంచనాలు ఉన్నాయి.
భారత జట్టులో దీప్తి శర్మ ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బౌలర్గా నిలిచారు. రెండు మ్యాచ్లలో ఆరు వికెట్లు తీసి తన బౌలింగ్ సత్తా ఏంటో చూపించారు. ఆమె ఎకానమీ రేట్ 5.21 కాగా, ప్రతి మ్యాచ్లో మూడు వికెట్ల చొప్పున సాధించారు.
భారత్ మహిళల జట్టు: ప్రతికా రావల్, స్మృతి మంధానా, హర్లీన్ దియోల్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్
దక్షిణాఫ్రికా మహిళల జట్టు: లారా వోల్వార్డ్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, మరిజానే క్యాప్, అన్నేకె బోష్, సినాలో జాఫ్తా (వికెట్ కీపర్), క్లోయ్ ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మసబతా క్లాస్, అయాబోంగా ఖాఖా, నాంకులూలెకో మ్లాబా
ఇటీవలి ఫామ్, బౌలింగ్ యూనిట్ ప్రదర్శన, హోమ్ అడ్వాంటేజ్ వంటి అంశాల పరంగా చూస్తే భారత్ మహిళల జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఐదు వన్డేల్లో దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించిన భారత జట్టు ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. అయితే, తొలి మ్యాచ్ లో ఓడినప్పటికీ రెండో మ్యాచ్ లో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చిన సౌతాఫ్రికాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. విశాఖ తీరంలో జరిగే ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ సూపర్ థ్రిల్ ను అందించడం పక్కాగా కనిపిస్తోంది !