India vs Sri Lanka : శ్రీలంకతో టెస్టు సిరీస్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇద్దరికీ కూడా కీలకంగా మారింది. ఈ సిరీస్ లో బౌలర్ల పాత్ర కీలకం కానుంది. మరి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో చోటుదక్కేనా?
ల్యాండ్ అయిన టీమిండియా.. ప్రాక్టీస్ మ్యాచ్తో శ్రీలంక సిరీస్ షురూ
భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. శుక్రవారం నుంచి టీమిండియా శ్రీలంక XI జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో తలపడుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే మొదటి టెస్టు కోసం తమ తుది జట్టును ఎంపిక చేసే పనిలో ఉన్నారు. శ్రీలంకలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అశ్విన్ అందుబాటులో లేకపోవడంతో, అక్కడ ఆడిన అనుభవం ఉన్న సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పాత్ర ఇప్పుడు చాలా కీలకంగా మారింది. శ్రీలంకను వారి సొంత గడ్డపై ఓడించాలంటే భారత స్పిన్నర్లు గట్టిగా పోరాడాల్సిందే.
25
ఇంగ్లండ్ సిరీస్ తప్పును మళ్లీ రిపీట్ చేస్తారా?
సొంత గడ్డపై లంకను దెబ్బతీయాలంటే గంభీర్, గిల్ ఎలాంటి స్పిన్ కాంబినేషన్తో బరిలోకి దిగుతారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా మేనేజ్మెంట్ ఒక పెద్ద పొరపాటు చేసింది. ఆ తప్పును శ్రీలంకలో మళ్లీ చేయకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో స్టార్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు. స్పిన్నర్లకు బాగా అనుకూలించే లార్డ్స్ వన్డేలో కూడా కుల్దీప్ను బెంచ్ మీదే కూర్చోబెట్టారు. అప్పుడు ఇంగ్లండ్ వద్ద ముగ్గురు స్పిన్నర్లు ఉంటే, భారత్ కేవలం అక్షర్ పటేల్తో సరిపెట్టుకుంది. దానివల్ల కుల్దీప్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.
35
9 ఏళ్ల కెరీర్.. కానీ ఆడింది 18 టెస్టులే
కుల్దీప్ యాదవ్ 2017లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ 9 ఏళ్ల కాలంలో అతను ఆడింది కేవలం 18 టెస్టులు మాత్రమే. జట్టులోకి ఎంపికవ్వడం, ఆ తర్వాత కేవలం తుది జట్టుకు దూరమై బెంచ్ కే పరిమితమవ్వడం అతనికి పరిపాటిగా మారింది. వన్డేల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడి బయటకు వెళ్లినప్పటి నుంచి కుల్దీప్ను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి పక్కన పెడుతున్నారు. హార్దిక్ లేకపోవడంతో బ్యాటింగ్ లోతును పెంచడానికి 8వ నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల ఆటగాడు కావాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ రన్-రేట్, బ్యాటింగ్ డెప్త్ లెక్కల తో ఒక మెయిన్ స్పిన్నర్ను అవకాశాలు దక్కడం లేదు.
ఒకవేళ శ్రీలంకతో జరిగే సిరీస్లో కూడా కుల్దీప్ యాదవ్ను పక్కన పెడితే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. శ్రీలంకలోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లపై కుల్దీప్ తన గూగ్లీలు, వేరియేషన్లతో ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టగలడు. ఒకవైపు రవీంద్ర జడేజా లైన్ అండ్ లెంగ్త్తో ఒత్తిడి పెంచితే, మరోవైపు కుల్దీప్ వికెట్లు పడగొట్టడంలో సిద్ధహస్తుడు. స్క్వాడ్లో మానవ్ సుతార్, సారాంశ జైన్ రూపంలో ఇద్దరు యంగ్ స్పిన్నర్లు ఉన్నప్పటికీ, కుల్దీప్కు ఉన్న సీనియారిటీ, మ్యాచ్ విన్నింగ్ అనుభవం వారికంటే చాలా ఎక్కువ.
55
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉందా?
రెండు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్టు 15 నుంచి గాల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. పిచ్ కండిషన్స్ బట్టి తుది జట్టును నిర్ణయిస్తారు. అయితే, లంక కండిషన్స్ దృష్ట్యా టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఎక్కువ. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లతో పాటు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న సారాంశ జైన్ వైపు మొగ్గు చూపవచ్చు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, జడేజా జట్టులోకి రావడంతో సుతార్ బెంచ్కే పరిమితం కాక తప్పదు. సుతార్, జడేజా ఇద్దరూ ఒకే తరహా బౌలర్లు కావడం వల్ల గంభీర్-గిల్ జోడీ అనుభవజ్ఞుడైన జడేజాకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాలి.