
భారత క్రికెట్ జట్టుకు దశాబ్దానికి పైగా సేవలందించిన ప్రముఖ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 37 ఏళ్ల పుజారా తన ఎక్స్ (X) ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించారు. భావోద్వేగ నోట్ లో రిటైర్మెంట్ ను ప్రకటించారు. “భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం పాడటం, జట్టు తరఫున మైదానంలో ప్రతి సారి అడుగుపెట్టడం ఒక అద్భుతమైన అనుభవం. నా జీవితం మొత్తంలో మరచిపోలేని క్షణాలు ఇవే” అని పేర్కొన్నారు.
పుజారా తన చిన్ననాటి కలను గుర్తు చేసుకుంటూ.. “రాజ్ కోట్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన చిన్న బాలుడిని నేను. భారత క్రికెట్ జట్టులో ఆడాలన్న కలతో నా తల్లిదండ్రులతో కలిసి నడక మొదలుపెట్టాను. ఈ ఆట నాకు ఇచ్చిన అనుభవాలు, గౌరవం, అవకాశాలు అన్నీ చాలా గొప్పవి. నా రాష్ట్రం, నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం” అని పేర్కొన్నారు.
తన క్రికెట్ జీవన ప్రయాణంలో సహకరించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), సౌరాష్ట్ర క్రికెట్ సంఘంకి పుజారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కోచ్లు, సహచరులు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ముఖ్యంగా అభిమానుల మద్దతు ఎప్పటికీ గుర్తుంటుందని పేర్కొన్నారు.
రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత టెస్టు క్రికెట్లో నయా వాల్ గా పుజారా గుర్తింపు సాధించారు. తన సహనంతో, క్రమశిక్షణతో ప్రత్యర్థి బౌలర్లను అలసిపోయేలా చేయడంలో దిట్ట. చాలా మ్యాచ్ లలో భారత్ ను ఓటమి నుంచి కాపాడారు. భారత జట్టుకు కష్టకాలంలో అండగా నిలిచారు. 2018-19లో ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు సిరీస్ విజయంలో పుజారా కీలక పాత్ర పోషించారు. ఆ సిరీస్లో 521 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు.
పుజారా భారత తరఫున 103 టెస్టులు ఆడి 7,195 పరుగులు చేశారు. అందులో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆడారు. ఆ తర్వాత యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంతో జట్టులో స్థానం దక్కలేదు. వయస్సు పెరుగుతుండటంతో అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇకపై పుజారా కామెంటరీకి పూర్తి సమయం కేటాయించనున్నారు.
37 ఏళ్ల ఛెతేశ్వర్ పుజారా 2023 జూన్లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత భారత్ తరపున ఆడలేదు. అప్పటి నుంచి అతన్ని సెలెక్టర్లు పట్టించుకోకపోవడమే అతని రిటైర్మెంట్ నిర్ణయానికి ప్రధాన కారణమైంది.
బీసీసీఐ యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, 2025 ఆస్ట్రేలియా పర్యటనలో కూడా పుజారా కాకుండా తక్కువ అనుభవం ఉన్న క్రికెటర్లను ఎంపిక చేశారు. అలాగే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో, పుజారాకు తిరిగి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.
దేశవాళీ క్రికెట్లో ముఖ్యంగా రంజీ ట్రోఫీ, కౌంటీ క్రికెట్లో పుజారా అద్భుతమైన ఫామ్లో ఉన్నా, జాతీయ జట్టులో స్థానం మాత్రం దక్కలేదు. తన రిటైర్మెంట్ ప్రకటనలో పుజారా నేరుగా సెలక్షన్ సమస్యను ప్రస్తావించకపోయినా.. “అన్ని మంచి విషయాలు ఒక రోజు ముగియాల్సిందే” అని పేర్కొనడం గమనార్హం.
భారత టెస్టు జట్టులో నయా వాల్ గా గుర్తింపు పొందిన పుజారా రిటైర్మెంట్ తో భారత క్రికెట్లో ఒక శకం ముగిసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. రాహుల్ ద్రావిడ్ తర్వాత టెస్టు జట్టులో పుజారా ఆ లోటును పూడ్చిన ఆటగాడు. అయితే పుజారా స్థానం భర్తీ చేయడం ప్రస్తుత యువ ఆటగాళ్లకు సవాల్ అని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.