
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగనున్న ఈ టోర్నీలో 15 మందితో కూడిన జట్టు ఆడనుంది. భారత జట్టుకు ఈసారి సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. భారత్ ఇప్పటికే 8 సార్లు ఆసియా కప్ గెలిచింది. తొమ్మిదో టైటిల్ టార్గెట్ గా బీసీసీఐ యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది.
23 ఏళ్ల యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ధనాధన్ బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 14 మ్యాచ్ల్లో 559 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ సగటు 43.00, స్ట్రైక్ రేట్ 159.71గా ఉంది. ఆరు హాఫ్ సెంచరీలు బాదాడు. ఇటీవల ముగిసిన భారత్-ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా బ్యాటింగ్ లో అదరగొట్టాడు.
ఈ ఫామ్ చూసి అతనికి ఆసియా కప్ 2025 భారత జట్టులో స్థానం దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ, అది జరగలేదు. దీనిపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. "యశస్వి విషయానికి వస్తే, ఇది నిజంగా దురదృష్టకరం. అభిషేక్ శర్మ గత సంవత్సర కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. పైగా అతను బౌలింగ్ కూడా చేయగలడు. ఒకవేళ అవసరమైతే బౌలింగ్ ఆప్షన్ గా కూడా ఉంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జట్టులో చోటు కోల్పోవాల్సిన పరిస్థితి. అందుకే, యశస్వి తన అవకాశం కోసం వేచి ఉండాలి" అని అన్నారు.
ప్రస్తుతం అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్లో మంచి ప్రదర్శన ఇస్తున్నారు. అభిషేక్ శర్మ గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్ లో మంచి ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చాడు. టీ20ల్లో తన దూకుడైన బ్యాటింగ్తో జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జట్టుకు త్వరగా పరుగులు సాధించడంలో సహాయపడుతుంది. శర్మ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత 17 టీ20లలో 193.85 స్ట్రైక్ రేట్తో 535 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
యశస్వి జైస్వాల్ విషయానికి వస్తే టెస్టులతో పాటు టీ20ల్లో తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్ లో అద్భుతమైన రికార్డులను కలిగి ఉన్నాడు. టీ20లలో కూడా జైస్వాల్ దూకుడైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 23 టీ20 మ్యాచ్లలో 164.32 స్ట్రైక్ రేట్తో 723 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
యశస్వి జైస్వాల్ మూడు ఫార్మాట్లలోనూ మెరుగ్గా రాణిస్తుండగా, అభిషేక్ శర్మ ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో తన బ్యాటింగ్తో సత్తా చాటుతున్నాడు. భారత జట్టు జైస్వాల్ ను కాదని అభిషేక్ శర్మ వైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణాలు చూస్తే.. అద్భుతమైన స్ట్రైక్ రేటు, అలాగే, బౌలింగ్ కూడా చేయగల సత్తా కలిగి ఉండటం. ఇది జట్టుకు ఒక అదనపు ప్రయోజనంగా భావించి బీసీసీఐ అభిషేక్ శర్మను జట్టులోకి తీసుకుంది.
ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న జైస్వాల్ కు ప్రధాన జట్టులో చోటు దక్కలేదు కానీ, రిజర్వ్ ప్లేయర్గా సెలెక్టర్లు ఎంపిక చేశారు. అంటే, ప్రధాన ఆటగాళ్లలో ఎవరైనా అందుబాటులో లేకుంటే జైస్వాల్కు అవకాశం దక్కనుంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేశ్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్
ఆసియా కప్ 2025లో భారత్ గ్రూప్ Aలో ఉంది. భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు ఇలా ఉన్నాయి..
• సెప్టెంబర్ 10: భారత్ vs UAE, దుబాయ్
• సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్థాన్, దుబాయ్
• సెప్టెంబర్ 19: భారత్ vs ఒమాన్, అబుదాబి
ఈ మూడు మ్యాచ్ల తర్వాత ఫలితాలను బట్టి భారత్ తర్వాతి దశలోకి చేరుతుంది.