Petrol and Diesel Prices: దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోలు బంకులు మూతపడటంతో మళ్లీ పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతాయనే వార్తలు వైరల్ గా మారాయి. ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తల పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సామాన్యుడిని భయపెడుతున్న వార్త ఒకటే.. 'ఎన్నికలు అవ్వగానే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయి'. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే లీటరుపై ఏకంగా రూ. 25 నుండి రూ. 28 వరకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ప్రజలకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ధరల పెంపుపై వస్తున్న వార్తలన్నీ కేవలం వదంతులేనని, ప్రస్తుతం ఇంధన ధరలను పెంచే ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కుండబద్దలు కొట్టింది.
24
అంతర్జాతీయ సంక్షోభం ఉన్నా.. సరఫరాకు ఢోకా లేదు
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన మాట వాస్తవమే అయినా, సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, వినియోగదారులు భయపడి భారీగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు.
34
గృహ వినియోగదారులకు 100% భరోసా
ముఖ్యంగా వంట గ్యాస్ వాడుకునే గృహిణులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యుద్ధం వల్ల దిగుమతులపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ, పైపుల ద్వారా వచ్చే గ్యాస్ సరఫరాలో ఎలాంటి కోత ఉండదని స్పష్టం చేసింది. వంద శాతం నిరంతరాయంగా గ్యాస్ అందిస్తామని హామీ ఇచ్చింది. అలాగే, వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సరఫరాను కూడా ఇప్పటికే 70 శాతం పునరుద్ధరించామని, త్వరలోనే ఇది సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
కేవలం గృహ అవసరాలే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఫార్మా, స్టీల్, విత్తన పరిశ్రమలకు ఇంధన ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా సరఫరా వ్యవస్థను పటిష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇంధన సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని, బ్లాక్ మార్కెట్ లేదా అక్రమ మళ్లింపులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాబట్టి, ధరల పెంపు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది.