Post Office MIS: ఈ పోస్టాఫీస్ పథకంలో చేరితే ప్రతీ నెల మీ ఖాతాల్లోకి రూ. 16,650 వస్తాయి.. ఏం చేయాలంటే.?

Published : Jun 07, 2026, 04:42 PM IST

Post Office MIS: ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) బెస్ట్ ఆప్షన్. కేంద్ర ప్రభుత్వ మద్ధతుతో అమలవుతున్న ఈ పొదుపు పథకంలో ఒకసారి పెట్టుబడి పెడితే ఐదేళ్ల పాటు ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది.

PREV
15
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అంటే ఏమిటి?

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ఒకేసారి నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టి, దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా పొందే పొదుపు పథకం. ఈ స్కీమ్‌లో కనీసంగా రూ.1,000తో ఖాతా ప్రారంభించవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ పథకం కాలపరిమితి ఐదేళ్లు. ఈ కాలంలో వడ్డీ రేటు మార్పులు జరిగినా, ఖాతా ప్రారంభించిన సమయంలో ఉన్న వడ్డీ రేటే ఐదేళ్ల పాటు వర్తిస్తుంది. దీంతో భవిష్యత్ ఆదాయంపై స్పష్టత ఉంటుంది. ప్రస్తుతం 2026 ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి ఈ పథకంపై వార్షికంగా 7.4 శాతం వడ్డీ అందిస్తున్నారు. పెట్టుబడికి పూర్తి భద్రత ఉండటం వల్ల రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు, స్థిరమైన ఆదాయం కోరుకునే కుటుంబాలు ఈ పథకంపై ఆసక్తి చూపుతున్నాయి.

25
ఈ పథకంలో ఎవరు చేరవచ్చు?

భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా ఈ పథకంలో ఖాతా ప్రారంభించవచ్చు. 18 సంవత్సరాలు దాటిన వారు స్వయంగా ఖాతా తెరవవచ్చు. 10 సంవత్సరాలు పైబడిన మైనర్లు కూడా తమ పేరుతో ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. 10 ఏళ్లలోపు పిల్లల కోసం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఖాతా నిర్వహించవచ్చు. అయితే ప్రవాస భారతీయులు (NRIలు) ఈ పథకంలో చేరేందుకు అర్హులు కారు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ప్రారంభించినా, మొత్తం పెట్టుబడి ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని మించకూడదు.

35
రూ.16,650 నెలవారీ ఆదాయం ఎలా వస్తుంది?

ఈ పథకం ద్వారా ఎక్కువ ఆదాయం పొందాలనుకునే కుటుంబాలు జాయింట్ ఖాతా, వ్యక్తిగత ఖాతాలను కలిపి వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ముగ్గురు సభ్యులు కలిసి ఒక జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టి, అదే సమయంలో ప్రతి ఒక్కరు తమ పేర్లపై రూ.4 లక్షల చొప్పున వ్యక్తిగత ఖాతాలు తెరిస్తే మొత్తం పెట్టుబడి రూ.27 లక్షలకు చేరుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7.4 శాతం వడ్డీ రేటు ప్రకారం ఈ పెట్టుబడిపై సంవత్సరానికి సుమారు రూ.1.99 లక్షల వడ్డీ లభిస్తుంది. దీన్ని నెలవారీగా లెక్కిస్తే సుమారు రూ.16,650 ఆదాయం వస్తుంది. ఇలా కుటుంబ సభ్యులు కలిసి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.

45
వడ్డీ చెల్లింపు, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు

ఈ పథకంలో వచ్చే వడ్డీ ప్రతి నెలా నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఖాతా ప్రారంభించే సమయంలో ECS లేదా ఆటో క్రెడిట్ సదుపాయాన్ని ఎంచుకుంటే వడ్డీ ఆటోమేటిక్‌గా జమ అవుతుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం పూర్తికాకముందు డబ్బు ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. ఒకటి నుంచి మూడు సంవత్సరాల మధ్య ఖాతా మూసివేస్తే పెట్టుబడిలో 2 శాతం కోత విధిస్తారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల మధ్య ఖాతా మూసివేస్తే 1 శాతం కోత ఉంటుంది. ఐదేళ్ల గడువు పూర్తయ్యాక అసలు పెట్టుబడి మొత్తాన్ని తిరిగి అందిస్తారు. ఈ ఖాతాను పొడిగించే అవకాశం లేకపోవడంతో కొనసాగించాలని భావిస్తే కొత్త ఖాతా తెరవాల్సి ఉంటుంది.

55
పన్ను నిబంధనలు, నామినీ ప్రాధాన్యం

ఈ పథకం ద్వారా లభించే వడ్డీ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది ‘ఇతర ఆదాయం’ కింద ప‌రిగ‌ణిస్తారు. ఈ పెట్టుబడిపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఎలాంటి మినహాయింపు ఉండదు. అలాగే వడ్డీపై టిడిఎస్ నిబంధనలు కూడా వర్తిస్తాయి. జాయింట్ ఖాతాల్లో పెట్టుబడి వాటా ఆధారంగా పన్ను బాధ్యత నిర్ణయిస్తారు. మైనర్ ఖాతాల నుంచి వచ్చే వడ్డీ సాధారణంగా తల్లిదండ్రుల ఆదాయంలో కలుపుతారు. ఖాతా ప్రారంభించే సమయంలో నామినీ నమోదు చేయడం చాలా ముఖ్యం. 

ఖాతాదారుడు మరణించిన సందర్భంలో డబ్బు కుటుంబ సభ్యులకు సులభంగా అందేందుకు ఇది ఉపయోగపడుతుంది. నామినీ లేకపోతే వారసత్వ ధ్రువీకరణ వంటి అదనపు ప్రక్రియలు అవసరమవుతాయి. భద్రత, నెలవారీ ఆదాయం, ప్రభుత్వ హామీ వంటి ప్రయోజనాల కారణంగా పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ 2026 ప్రస్తుతం పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఇది ఉపయోగకరమైన పథకంగా చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories