Indian Railway: దేశంలో ఎక్కువ మంది రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. అయితే కొందరు రైలు దిగే సమయంలో తమ బ్యాగులను మర్చిపోయిన సందర్భాలు ఉంటాయి. మర్చిపోయిన బ్యాగులను తిరిగిపొందేందుకు రైల్ మదద్ అనే యాప్ ఉందని తెలుసా.?
రైల్ మదద్ అనేది భారతీయ రైల్వేల ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార ప్లాట్ ఫామ్. ప్రయాణికులు టికెట్లు, పరిశుభ్రత, భద్రత, సౌకర్యాలు వంటి అంశాలపై ఫిర్యాదులు చేయడంతో పాటు, రైలులో మరిచిపోయిన వస్తువుల గురించి కూడా సమాచారం ఇవ్వవచ్చు. ఈ సేవ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. మొబైల్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఎప్పుడైనా ఫిర్యాదు నమోదు చేయవచ్చు.
26
పోయిన వస్తువు గురించి ఎలా ఫిర్యాదు చేయాలి?
రైల్లో వస్తువు మరిచిపోయిన వెంటనే రైల్ మదద్ యాప్లోకి వెళ్లి ఫిర్యాదు నమోదు చేయాలి. అందులో మీ PNR నంబర్ నమోదు చేయాలి. పోయిన వస్తువు వివరాలు ఇవ్వాలి, ఫిర్యాదును సమర్పించాలి. ఫిర్యాదు నమోదు చేసిన వెంటనే ఆ రైలు ప్రయాణిస్తున్న మార్గంలోని సంబంధిత రైల్వే అధికారులకు సమాచారం చేరుతుంది. దీంతో వస్తువును వెతికే ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది.
36
యాప్ లేకపోయినా ఫిర్యాదు చేయవచ్చు
స్మార్ట్ఫోన్ ఉపయోగించని వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైల్వే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అదే విధంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. కేసు నమోదు అయిన తర్వాత సంబంధిత రైల్వే విభాగాలకు సమాచారం వెళ్తుంది. రైల్వే అధికారుల ప్రకారం, ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే అంత త్వరగా సెర్చింగ్ ప్రారంభమవుతుంది. దీంతో వస్తువు తిరిగి దొరికే అవకాశాలు కూడా పెరుగుతాయి.
ప్రయాణికులు తాము దిగిన స్టేషన్లో లేదా రైలు చేరే తదుపరి ప్రధాన స్టేషన్లో కూడా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదులను స్టేషన్ మాస్టర్, లాస్ట్ ప్రాపర్టీ కౌంటర్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్వీకరిస్తాయి. అనంతరం అధికారులు వస్తువును గుర్తించేందుకు చర్యలు ప్రారంభిస్తారు.
56
వస్తువు దొరకకపోతే ఏం చేయాలి?
కొన్ని సందర్భాల్లో వెంటనే వస్తువు దొరకకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు RPF వద్ద FIR నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. FIR నమోదు అయిన తర్వాత రైలు మొత్తం ప్రయాణ మార్గంలో మరింత విస్తృతంగా శోధన చేపడతారు. రైల్వే అధికారుల ప్రకారం, ఎక్కువ శాతం కేసుల్లో పోయిన వస్తువులు గుర్తించి యజమానులకు తిరిగి అందజేస్తున్నారు.
66
ప్రయాణికులకు ఉపయోగపడుతున్న డిజిటల్ సేవ
రైల్వేల డిజిటల్ సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన రైల్ మదద్ సేవ ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఒకప్పుడు పోయిన వస్తువుల కోసం స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని నిమిషాల్లోనే ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేసి సహాయం పొందే అవకాశం కలిగింది. అందువల్ల రైలులో ఏదైనా వస్తువు మరిచిపోయినా భయపడకుండా వెంటనే రైల్ మదద్ ద్వారా సమాచారం ఇవ్వడం ఉత్తమం.