Atal Pension Yojana: ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ వస్తుందనే విషయం తెలిసిందే. అయితే ప్రైవేట్ ఉద్యోగులు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కోసం కేంద్రం అటల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది.
అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY)ను ప్రారంభించింది. 2015లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. పెన్షన్ ఫండ్ రెగ్యులరేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ కొనసాగుతోంది. ఈ పథకంలో చేరిన వారు 60 ఏళ్లు పూర్తయ్యాక ప్రతి నెలా స్థిరమైన పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఇది ఒక భరోసా పథకంగా చెప్పొచ్చు.
25
ఎవరు అర్హులు?
ఈ పథకంలో చేరాలంటే వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుడికి బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉండటం తప్పనిసరి. ఆధార్, మొబైల్ నంబర్, ఇతర కేవైసీ పత్రాలు అవసరం అవుతాయి. ఇప్పటికే ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నవారు లేదా ఇతర పెన్షన్ పథకాలలో ఉన్నవారు ఈ స్కీమ్కు అర్హులు కారు. అందువల్ల ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్నవారిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకం రూపొందించారు.
35
నెలకు ఎంత చెల్లించాలి?
ఈ పథకంలో చెల్లించాల్సిన మొత్తం వయస్సు ఆధారంగా మారుతుంది. చిన్న వయస్సులో చేరితే తక్కువ మొత్తంతోనే ప్రారంభించవచ్చు, కానీ ఆలస్యంగా చేరితే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో చేరిన వ్యక్తి నెలకు సుమారు రూ. 42 నుంచి రూ. 210 వరకు చెల్లిస్తే సరిపోతుంది. అదే 40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ. 1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎంచుకునే పెన్షన్ మొత్తాన్ని బట్టి చెల్లింపులు నిర్ణయిస్తారు. ఉదాహరణకు మీ వయసు 23 ఏళ్లు అయితే నెలకు రూ. 300 చెల్లిస్తే నెలకు రూ. 5 వేల పెన్షన్ వస్తుంది. అంటే రోజుకు రూ. 10 చెల్లించాలి.
ఈ స్కీమ్లో చేరిన వారు 60 ఏళ్లు పూర్తయ్యాక నెలకు రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు స్థిరమైన పెన్షన్ పొందుతారు. మీరు ఎంత మొత్తం చెల్లిస్తే దానికి అనుగుణంగా పెన్షన్ కూడా ఉంటుంది. ఈ పథకంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, సభ్యుడు మరణించిన తర్వాత కూడా కుటుంబానికి భద్రత ఉంటుంది. ముందుగా జీవిత భాగస్వామికి అదే పెన్షన్ అందుతుంది. ఇద్దరూ లేకపోతే నామినీకి మొత్తం కార్పస్ చెల్లిస్తారు. ఉదాహరణకు రూ. 5,000 పెన్షన్ ఎంచుకుంటే సుమారు రూ. 8.5 లక్షల వరకు కార్పస్ లభిస్తుంది.
55
ఎలా దరఖాస్తు చేయాలి?
ఈ పథకంలో చేరడం చాలా సులభం. దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా బ్యాంక్ యాప్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ పథకంలో ఆటో డెబిట్ సదుపాయం ఉంటుంది. అంటే ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమెటిక్గా చెల్లింపు జరుగుతుంది. అయితే ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ లేకపోతే చిన్న మొత్తంలో పెనాల్టీ విధిస్తారు. కొంతకాలం చెల్లింపులు చేయకపోతే ఖాతా నిలిపివేత, డీయాక్టివేషన్ లేదా మూసివేస్తారు. అలాగే అవసరమైతే మధ్యలో పథకం నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది, కానీ కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఈ విధంగా అటల్ పెన్షన్ యోజన చిన్న మొత్తాలతో ప్రారంభించి భవిష్యత్లో స్థిరమైన ఆదాయం అందించే మంచి పథకంగా నిలుస్తోంది.