IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్

Published : Mar 07, 2026, 08:00 AM ISTUpdated : Mar 07, 2026, 08:10 AM IST

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండ్రోజులు, తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలతో పాటు నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
15
మళ్లీ వర్షాలు..

Rain Alert : కొన్నేళ్లుగా అసలు కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో కేవలం వర్షాకాలంలోనే వానలు పడేవి... కానీ ఇప్పుడు చలి, వేసవి కాలాల్లోనూ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పుడు ఆకాశం నిర్మలంగా ఉంటుందో... ఎప్పుడు మేఘాలు కమ్మేసి వానలు కురుస్తాయో చెప్పడం కష్టంగా మారింది. ప్రస్తుతం వేసవి కొనసాగుతోంది... ఎండలు మండిపోతున్నాయి... ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల వాతావరణ విభాగాలు వర్ష హెచ్చరికలు జారీ చేశాయి.

25
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ (మార్చి 7, శనివారం) వాతావరణం పూర్తిగా మారిపోతుందని... పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. దీంతో వాతావరణం చల్లబడి ప్రజలకు ఎండల నుండి కాస్త ఉపశమనం లభించనుంది.

ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు (మార్చి 7,8) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురుస్తాయని... అయితే వీటికి ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడవడంతో ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయిని హెచ్చరిస్తోంది విపత్తు నిర్వహణ సంస్థ.

35
ఈ ఆరుజిల్లాల్లో అలర్ట్..

వర్షసూచనలు ఉన్న ఆరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వాన కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపిఎస్డిఎంఏ సూచించింది. ముఖ్యంగా వ్యవసాయ పనులుచేసే రైతులు, కూలీలు వర్షం సమయంలో అస్సలు చెట్లకింద ఉండరాదని సూచించింది. ఈదురుగాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపడటం, పిడుగులు కూడా చెట్లపైనే ఎక్కువగా పడే అవకాశాలుండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణసమయంలో వర్షం మొదలైతే హోర్డింగ్ లు, కటౌట్లు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది.

45
తెలంగాణలో వర్షాలు

తెలంగాణ విషయానికి వస్తే... ఈ నెల మార్చి మధ్యలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి 16 తర్వాత అకాల వర్షాలు మొదలవుతాయని... మార్చి 18,10 తేదీల్లో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలుంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. గత నెల పిబ్రవరి వర్షాలు కురిసిన విషయం తెలిసిందే... అంతకంటే ఎక్కువ వర్షాలు రాబోయే రోజుల్లో ఉంటాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.

55
తెలంగాణలో మండుటెండలు... రికార్డ్ టెంపరేచర్స్

ఇక ప్రస్తుతం తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి... ఇవాళ(మార్చి 7) అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ముఖ్యంగా ఈస్ట్, నార్త్ తెలంగాణ జిల్లాలు అంటే ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో రికార్డు స్థాయిలో 40-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ లో కూడ 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయట. మిగతా తెలంగాణ జిల్లాల్లోనూ 36 నుండి 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కాబట్టి మధ్యాహ్నం సమయంలో ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories