ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ (మార్చి 7, శనివారం) వాతావరణం పూర్తిగా మారిపోతుందని... పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. దీంతో వాతావరణం చల్లబడి ప్రజలకు ఎండల నుండి కాస్త ఉపశమనం లభించనుంది.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు (మార్చి 7,8) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కురుస్తాయని... అయితే వీటికి ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులు తోడవడంతో ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయిని హెచ్చరిస్తోంది విపత్తు నిర్వహణ సంస్థ.