Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. గురువారం కూడా హైదరాబాద్ తో సహా ఏపీ, తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖలు హెచ్చరించాయి.
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి వంటివాటి ప్రభావంతో వేసవిలోనూ వానలు పడుతున్నాయి. ఇలాంటి సమయంలో హిందూమహాసముద్రంలో హోరాసియో (Horacio) తుపాను ఏర్పడింది... దీంతో ప్రజలు కంగారుపడిపోతున్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఏర్పడిన అత్యంత భయంకరమైన తుపాను ఈ హోరాసియో అని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే దీని ప్రభావం భారతదేశంపై ఉండదన్న వాతావరణ శాఖ ప్రకటన ఊరటనిస్తోంది.
25
ఏపీలో వర్షాలు
ఇదిలావుంటే ద్రోణి ప్రభావంతో ఇవాళ (గురువారం, 26 ఫిబ్రవరి) ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. ఇలా ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.
35
తెలంగాణలో వర్షాలు... ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ కూడా ఇవి కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లో గత రెండ్రోజులుగా ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం చల్లగా ఉంటోంది... ఇవాళ కూడా ఇదే వెదర్ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలుంటాయని హెచ్చరించింది. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కంటోన్మెంట్, ఆల్వాల్ ప్రాంతాల్లో చిరుజల్లులకు అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
55
మండిపోతున్న ఎండలు
ఇలా ఓవైపు వర్షాలు కొనసాగుతుండగానే మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. నిన్న(బుధవారం) రామగుండంలో అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అత్యల్పంగా తెల్లవారుజామున ఆదిలాబాద్ లో 16.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇదే ఆదిలాబాద్ లో మధ్యాహ్నానికి 32.8 డిగ్రీలకు టెంపరేచర్ చేరుకుని ఎండ మండిపోయింది. హన్మకొండలొ 33, మహబూబ్ నగర్ లో 32, భద్రాచలంలో 32.6, హకీంపేటలో 32.9, మహబూబ్ నగర్, నిజామాబాద్ లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.