Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. జనం బేజారవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరడంతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కూడా ఎండలు మండుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోయింది. సూర్యుడు పొద్దున 8 గంటలకే తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.
ముఖ్యంగా శ్రీకాకుళం నుండి ప్రకాశం జిల్లా వరకు ఉష్ణోగ్రతలు ఏకంగా 45 నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 10 దాటితే చాలు, బయటకు రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ రోడ్లెక్కి రిస్క్ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలు వేడి గాలులతో అల్లాడిపోతున్నాయి.
45 నుండి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రాంతాలు: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలు.
43 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రాంతాలు: నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలు.
41 నుండి 43 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రాంతాలు: అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71 మండలాల్లో తీవ్రమైన హీట్ వేవ్స్, అలాగే మరో 277 మండలాల్లో సాధారణ వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అనకాపల్లిలో 20, శ్రీకాకుళంలో 18 మండలాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.
35
ఇంతలా ఉక్కపోతకు కారణం ఏంటి? ఎల్నినో ఎఫెక్ట్ ఉందా?
ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింతలా వాతావరణం మారిపోయింది? అంటే దీని వెనుక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చిన విపరీతమైన మార్పులే ప్రధాన కారణం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో కండిషన్స్ బలపడుతున్నాయి.
వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్, NOAA రిపోర్టుల ప్రకారం, 2026 మే-జూలై మధ్యలో ఎల్నినో ఏర్పడే అవకాశాలు 82% వరకు ఉన్నాయి. ఇది శీతాకాలం వరకు కొనసాగే ఛాన్స్ 96% వరకు ఉంది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్లే భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ, మధ్య భారత్లో హీట్ వేవ్ రోజులు బాగా పెరిగిపోయాయి.
బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో మెరైన్ హీట్ వేవ్స్ కూడా విపరీతంగా పెరిగాయి. అరేబియా సముద్రంలో 20-30% ప్రాంతం నిరంతరం వేడెక్కుతూనే ఉంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ హెచ్చరికల ప్రకారం, హిందూ మహాసముద్ర జలాలు అంత తేలికగా చల్లబడటం లేదు.
గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాలు వేడెక్కి, ఆ వేడి గాలి తీర ప్రాంతాలపై పడటంతోనే ఈ సడెన్ ఉక్కపోత, తీవ్రమైన చెమటలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో కూడా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మే చివరి వారంలో తుపాను వచ్చేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.
55
తీవ్ర ఎండలు, ఉక్కపోత : ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐఎండీ (IMD) రిపోర్టుల ప్రకారం, తెలంగాణలో మే 19 నుండి 21 వరకు, ఏపీలో మే 20 నుండి 24 వరకు ఈ హీట్ వేవ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రాయలసీమ, దక్షిణ కోస్తా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన చెదురుమదురు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. జూన్లో నైరుతి రుతుపవనాలు వస్తేనే ఎండల ప్రభావం తగ్గనుంది.
ఎండలతో జాగ్రత్తగా ఉండాలి. బాడీ హైడ్రేటెడ్గా ఉండటానికి రోజంతా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ లాంటి ద్రవపదార్థాలు తాగుతూ ఉండాలి. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు మధ్యాహ్నం పూట అస్సలు బయటకు వెళ్లకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించి, గొడుగు లేదా టోపీ వాడటం మంచిది.