
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రతి రోజు వేలాది మంది భక్తులు అలిపిరి కాలినడక మార్గం ద్వారా కొండపైకి చేరుకుంటారు. ఈ ప్రయాణంలో భక్తుల భద్రత అత్యంత కీలకం. ముఖ్యంగా అటవీ ప్రాంతం గుండా వెళ్లే మార్గాల్లో వన్యప్రాణుల సంచారం ఉండటంతో భద్రతా చర్యలు మరింత అవసరం అవుతాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది.
భక్తులకు సురక్షిత ప్రయాణం కల్పించేందుకు కృత్రిమ మేథ (AI) ఆధారిత కెమెరాలు, డ్రోన్లు వంటి అత్యాధునిక పరికరాలను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇవి జంతువుల కదలికలను ముందుగానే గుర్తించి భక్తులకు ప్రమాదం లేకుండా చర్యలు తీసుకునేలా సహాయపడుతున్నాయి.
అలిపిరి నుంచి తిరుమల వరకు ఉన్న కాలినడక దారిలో భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా ఏఐ ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి సౌరశక్తితో పనిచేస్తూ 360 డిగ్రీల కోణంలో చుట్టుపక్కల పరిస్థితులను గమనించగలుగుతాయి. దాదాపు 400 మీటర్ల దూరంలో ఉన్న కదలికలను కూడా స్పష్టంగా గుర్తించగల సామర్థ్యం ఈ కెమెరాలకు ఉంది. ముఖ్యంగా చిరుత, ఎలుగుబంటి వంటి వన్యప్రాణులు కనిపిస్తే వెంటనే వాటిని గుర్తించి సమాచారం పంపే విధంగా రూపొందించారు. ఈ కెమెరాలు చెన్నైకి చెందిన ధీరా సంస్థ తయారు చేసింది. జంతువుల కదలికలతో పాటు మార్గంలో ఉన్న పరిస్థితులను కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయి.
ఏఐ కెమెరాలు గుర్తించిన సమాచారం వెంటనే తిరుమలలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుతుంది. అదే సమయంలో సంబంధిత మొబైల్ యాప్కు కూడా అలర్ట్ వెళ్తుంది. కెమెరా వద్ద ఏర్పాటు చేసిన అలారం సైరన్ స్వయంగా మోగి జంతువులను భయపెడుతుంది. ఆ శబ్దంతో అవి అడవిలోకి వెళ్లిపోతాయి. ఈలోపు సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అవసరమైతే భక్తులను సురక్షిత ప్రాంతాలకు మళ్లించే చర్యలు చేపడతారు.
కాలినడక మార్గానికి రెండు వైపులా మొత్తం 110 నుంచి 125 వరకు ఏఐ కెమెరాలను ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రణాళిక రూపొందించింది. ఈ ఏర్పాట్లు నాలుగు దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో భాగంగా నరసింహస్వామి ఆలయం ప్రాంతంలో ఇప్పటికే 12 కెమెరాలు అమర్చారు. భవిష్యత్తులో మొత్తం మార్గం అంతా ఈ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం వల్ల అటవీ ప్రాంతంలో భక్తుల ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది.
కెమెరాలతో పాటు ‘జేరా’ పేరుతో అత్యాధునిక డ్రోన్లను కూడా టీటీడీ వినియోగంలోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం రెండు డ్రోన్లు పర్యవేక్షణలో ఉన్నాయి. సాయంత్రం సమయంలో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 6.30 గంటల నుంచి ఈ డ్రోన్లు గాల్లో పర్యటిస్తాయి. దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో విహరిస్తూ జంతువుల కదలికలను గమనిస్తాయి. జంతువులు కనిపించిన వెంటనే డ్రోన్లలో ఉన్న లైట్లు, స్పీకర్లు పనిచేసి శబ్దాలు చేస్తాయి. దీంతో అవి అడవిలోకి వెళ్లిపోతాయి. ఈ ప్రాజెక్టు అమలుకు సుమారు రూ.4 కోట్ల వ్యయం అవుతుందని టీటీడీ తెలిపింది. తెలంగాణకు చెందిన దాత సత్యప్రసాద్ ఈ కార్యక్రమానికి సహకారం అందించారు.
టీటీడీ ప్రస్తుతం ఈ ఏఐ సాంకేతికతను భద్రతకే కాకుండా భక్తుల రద్దీ నిర్వహణలో కూడా ఉపయోగిస్తోంది. ఆలయ పరిసరాలు, మాడ వీధులు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు భక్తుల కదలికలను నిరంతరం గమనిస్తాయి. ఈ కెమెరాలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్కు అనుసంధానించారు. అక్కడి నుంచి అధికారులు ఎక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారో వెంటనే తెలుసుకోగలుగుతున్నారు. దీంతో అవసరమైన చోట భద్రతా ఏర్పాట్లు పెంచడం, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించడం సులభమవుతోంది. ఫలితంగా శ్రీవారి దర్శనం వేగంగా జరిగే అవకాశం పెరిగింది.
టీటీడీ అధికారులు ఈ సాంకేతిక వ్యవస్థను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో తిరుమల మొత్తం ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో భక్తులు గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే వాహన సేవలు, ఉత్సవాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనే భక్తుల సంఖ్యను కూడా సులభంగా అంచనా వేయవచ్చు. ఈ విధంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ భక్తుల భద్రత, సౌకర్యం, దర్శన వేగం పెంచేందుకు టీటీడీ కొత్త అడుగులు వేస్తోంది.