గురువారం అధికారిక సెలవే... కానీ వారికి మాత్రమే :
ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణకు జైన మతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ ప్రాంతాల్లో అనేక జైనతీర్థాలు ఉన్నాయి... తెలంగాణలోని కొలనుపాక ఇందులో ప్రత్యేకమైనది. ఇరు రాష్ట్రాల్లోనూ జైన్స్ గుర్తించదగిన స్థాయిలో ఉన్నారు. ఈ క్రమంలో జైనుల ఆరాధ్యదైవం, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడి జయంతి సందర్భంగా ఏప్రిల్ 10న సెలవు ఇచ్చారు.
అయితే ఈ సెలవు అందరికి వర్తించదు. మహవీర్ జయంతికి సాధారణ సెలవు కాకుండా ఐచ్చిక సెలవు ప్రకటించాయి ఇరు తెలుగు రాష్ట్రాలు. ఈ క్రమంలో కేవలం జైనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని స్కూళ్లకు ఈ సెలవు వర్తించనుంది. జైన మతానికి సంబంధించిన ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు కూడా సెలవు ఉంటుంది. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని విద్యాసంస్థలకు మాత్రమే సెలవు ఉండనుంది... మిగతా స్కూళ్లు, కాలేజీలు యధావిధిగా నడుస్తాయి.
ఇక ఈ ఏప్రిల్ 12 నుండి అంటే వచ్చే శనివారం నుండి మాత్రం అన్ని విద్యాసంస్థలకు మూడ్రోజుల సెలవు ఉంటుంది. ఏప్రిల్ 12న రెండో శనివారం, ఏప్రిల్ 13న ఆదివారం సాధారణ సెలవులు. ఇక ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సెలవు ఇచ్చారు. కాబట్టి రేపు సెలవు రాకున్నా రెండ్రోజుల తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి.