Kia Theft
ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మార్చి 2025లో నిర్వహించిన ఆడిట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గత ఐదేళ్లుగా పెద్ద స్థాయిలో కారు ఇంజన్లు దొంగతనానికి గురైన ఘటన తాజాగా బయటకు పడింది. అంచనా ప్రకారం సుమారు 900 కార్ల ఇంజన్లు దొంగతనానికి గురైనట్లు కంపెనీ గుర్తించింది. దీని విలువ సుమారు కోట్ల రూపాయలలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Kia Plant
ఈ ఘటనపై పెనుకొండ డీఎస్పీ వై. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగిన మోసం కావొచ్చని, ఈ మోసంలో కంపెనీలో పనిచేసే వారి ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కంపెనీలో గతంలో పనిచేసిన లేదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగుల చేతివాటం ఇందులో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతటి పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్న ప్లాంట్లో ఇలాంటి భారీ దొంగతనం జరగడం ఆశ్చర్యంగా ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
ఇంతకీ ఇంజన్లు ఏమైనట్లు.?
అయితే మాయమైన ఆ కార్ల ఇంజన్లు ఏమై పోయాయన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏపీలో ఉన్న కియా ప్లాంట్లో కార్లు తయారీలో భాగంగా ఇంజన్లు తమిళనాడులో తయారవుతున్నాయి. అయితే తమిళనాడు నుంచి రవాణా జరిగే సమయంలో చోరీకి గురయ్యాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. గత నెల 19వ తేదీన కంపెనీ ప్రతినిధులు ఈ విషయమై పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు లేకుండా విచారణ చేయమని పోలీసులను కోరగా అధికారులు దానికి నిరాకరించారు. దీంతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.