Sathya sai Jayanthi: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం పుట్టపర్తి చేరుకున్నారు.
పుట్టపర్తిలో జరుగుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందుగా ప్రశాంతి నిలయం చేరుకున్న మోదీ, మహాసమాధిని దర్శించి ప్రార్థనలు చేశారు.
25
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్వాగతం
పుట్టపర్తి విమానాశ్రయం వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు ప్రధానమంత్రిని ఆహ్వానించారు. రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం శతజయంతి వేదికకు ప్రధానమంత్రి చేరుకున్నారు.
35
గోదాన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ
జయంతి సమావేశం ముందు నిర్వహించిన గోదాన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రశాంతి నిలయానికి 100 గిరి గోవులను ప్రధాని మోదీ దానం చేశారు.
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భగవాన్ సత్యసాయి బాబా జీవితం, సేవా సిద్ధాంతాన్ని ప్రతిబింబించే ప్రత్యేక స్మారక నాణెం, స్టాంపులను ప్రధాని విడుదల చేయనున్నారు. ఈ ఆవిష్కరణ తర్వాత మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయిబాబా బోధనలు, విశ్వ మానవ సేవపై మోదీ సందేశం ఇవ్వనున్నట్లు పీఎంవో తెలిపింది.
55
పాత క్షణాలు గుర్తుచేసుకున్న మోదీ
పర్యటనకు కొన్ని గంటల ముందు ప్రధానమంత్రి మోదీ ఎక్స్లో ఒక ఆసక్తికర పోస్టు చేశారు. గతంలో సాయిబాబాతో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ, బాబా సూచనలు తనకు ఎంతో ప్రేరణ ఇచ్చాయని గుర్తుచేసుకున్నారు. ‘‘పుట్టపర్తిలో జరిగే శతజయంతి ఉత్సవాల్లో నా ఆంధ్రప్రదేశ్ సోదర సోదరీమణుల మధ్య ఉండటం నాకు ఆనందంగా ఉంది’’ అని మోదీ రాసుకొచ్చారు.
ఉత్సవాలకు పెద్ద ఎత్తున హాజరు
శతజయంతి వేడుకలకు ఈరోజు లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశముంది. దాదాపు 500 మంది వీవీఐపీలు కూడా హాజరవుతున్నారు. మాజీ సీజేఐ ఎన్వీ రమణ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్ వంటి పలువురు ప్రముఖులు ఇప్పటికే పుట్టపర్తికి చేరుకున్నారు.