నెల రోజుల సీఎం జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు.. ఎన్టీఆర్ అమెరికాలో ఉండ‌గా నాదెండ్ల సీఎం ఎలా అయ్యారు.?

Published : Apr 22, 2026, 03:41 PM IST

Nadendla Bhaskara Rao: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌రరావు బుధ‌వారం తుది శ్వాస విడిచారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న జీవితంలోని కొన్ని ముఖ్య ఘ‌ట‌న‌లు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
90 ఏళ్ల వ‌య‌సులో

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్యంతో పాటు ఆరోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్న ఆయన, బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. పలువురు ప్రముఖ నేతలు ఆయనకు నివాళులు అర్పిస్తూ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఆయన అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉంచారు.

25
విద్య నుంచి రాజకీయాల దాకా ప్రయాణం

1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించిన భాస్కరరావు, సాధారణ కుటుంబం నుంచి వచ్చి విద్యలో ముందంజ వేశారు. హైదరాబాద్‌లోని వివేక వర్ధిని కాలేజీలో బీఏ పూర్తి చేసి, తరువాత న్యాయశాస్త్రం అభ్యసించారు. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన, ప్రజా సమస్యలపై ఆసక్తి పెరగడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదట కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజాప్రతినిధిగా గుర్తింపు పొందారు. తన తెలివితేటలు, వ్యూహాత్మక దృష్టితో త్వరగానే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

35
తెలుగు దేశం పార్టీ స్థాప‌న‌లో కీల‌క పాత్ర‌

1980లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాల్లో భాస్కరరావు పాత్ర ఎంతో ముఖ్యమైనది. నందమూరి తారకరామారావుతో కలిసి 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ ఆవిర్భావం తరువాత ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేప‌ట్టారు. అయితే 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు ఆయన జీవితాన్ని మలుపుతిప్పాయి. ఆ సమయంలో ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతుండగా, రాజకీయ వ్యూహాలతో భాస్కరరావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీశాయి. చివరకు ఆయన పదవీకాలం కేవలం ఒక నెల రోజులకు పరిమితమైంది. ఇలా నాదెండ్ల కేవ‌లం నెల రోజులు మాత్ర‌మే ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్నారు.

45
ప్ర‌జాస్వామిక తెలుగుదేశం పార్టీ

తెలుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చాక, ఆయన ప్రజాస్వామిక తెలుగుదేశం పార్టీ ప్రారంభించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి, సుదీర్ఘ కాలంకొనసాగారు. 1998లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచారు. రాజకీయాల్లో మార్పులు, విభేదాలు వచ్చినా ఆయన చురుకుదనం మాత్రం తగ్గలేదు. జీవితాంతం ప్రజా జీవితం కొనసాగించిన నేతగా గుర్తింపు పొందారు.

55
కుటుంబం, వారసత్వం

భాస్కరరావు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆయనకు భార్య లలిత. ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్న విష‌యం తెలిసిందే. రాజకీయ జీవితంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ, రాష్ట్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు భాస్కరరావు. ముఖ్యంగా అత్యల్ప కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. మొత్తం మీద ఆయన మరణంతో ఒక రాజకీయ శకం ముగిసిందనే భావన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరిగిన కీలక పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఈ నేత, తన పాత్రతో ఎప్పటికీ గుర్తుండిపోతారన‌డంలో సందేహం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories