Weather Update : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Published : Sep 11, 2026, 09:21 AM IST

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ, అధికారులు సూచించారు.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వానలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఒడిశా తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర దిశగా ప్రయాణించి, ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న రోజుల్లో మరింత కదులుతూ విదర్భ వైపు వెళ్లే క్రమంలో బలహీనపడే సూచనలు ఉన్నాయి. అయితే, ఈ సిస్టమ్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే రెండు నుంచి మూడు రోజులు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖపట్నం, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి.

25
ఉత్తరాంధ్రను వణికించనున్న ఈదురుగాలులు, పిడుగులు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ఇంపాక్ట్ తీవ్రంగా ఉండనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

వీటితో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు విస్తారంగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వానలు స్టార్ట్ అయ్యాయి.

35
సముద్రంలో వేటకు నో.. మత్స్యకారులకు అలర్ట్

కోస్తా తీరం వెంబడి వాతావరణం బాగా కల్లోలంగా మారింది. ఉత్తర కోస్తా తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడమే కాకుండా పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే నీటిలోకి వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తీరానికి తిరిగి రావాలని స్పష్టం చేశారు.

45
తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి?

తెలంగాణలోనూ ఈ అల్పపీడన ఎఫెక్ట్ సెప్టెంబర్ 14 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో వర్షాల తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, 50 నుంచి 70 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అయితే దక్షిణ తెలంగాణలోని జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మాత్రం వర్షాల ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

55
హైదరాబాద్ లోనూ వర్షాలు

రాజధాని హైదరాబాద్‌ విషయానికి వస్తే, నగరం రోజంతా సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో నగరంలో చినుకులు పడే సూచనలు ఎక్కువ. ఇక సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తున్నారు. రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అలర్ట్ చేశారు.

వర్షాలు, బలమైన ఈదురుగాలుల సమయంలో ప్రజలు పాత భవనాలు, పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories