సోషల్ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారాన్ని కంట్రోల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికలపై నిరాధారమైన ప్రచారాన్ని అడ్డుకోవడానికి కొత్త చర్యలు చేపట్టనుంది. ఈ దిశగా గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ప్రత్యేక సబ్కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో హోం, రెవెన్యూ, పౌరసరఫరాలు, సమాచార శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారు. తప్పుడు ప్రచారాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
25
చంద్రబాబు హెచ్చరిక
నకిలీ వార్తల (Fake News) ద్వారా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నాలను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై అపనమ్మకాన్ని కలిగించే విధంగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఇకపై రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. “ఇలాంటి దుష్ప్రచారాన్ని సహించం, కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
35
పలు ఉదాహరణలు
ఇటీవల ఎరువుల కొరత ఉందని, అమరావతిలో వరదలు వచ్చాయని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. అలాగే హంద్రీనీవా కాలువలో ప్రవాహం ఆగిపోయిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వెళ్తుందని నిరాధారమైన కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇవన్నీ సమాజంలో గందరగోళానికి కారణమయ్యాయని చంద్రబాబు ప్రస్తావించారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తప్పుడు ప్రచారాన్ని ఆపేందుకు ప్రత్యేక చట్టాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం ద్వారా నిరాధారమైన వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా వ్యక్తిత్వ హననం, రాజధానిపై వదంతులు, ప్రభుత్వ కార్యక్రమాలపై అబద్ధపు కథనాల వంటి వాటికి చెక్ పెట్టనున్నారు.
55
ఇకపై తప్పించుకోలేరు
“తప్పుడు సమాచారాన్ని షేర్ చేసే వారు ఎంత పెద్దవారైనా చట్టం నుంచి తప్పించుకోలేరు” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. “ప్రజలకు గందరగోళం కలిగించే తప్పుడు వార్తలు కట్టడి చేయడమే ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని ఆయన అన్నారు.