వారం రోజుల్లో త‌ల్లిదండ్రుల ఖాతాల్లోకి రూ. 13 వేలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం

Published : Jul 16, 2026, 07:58 PM IST

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే ‘తల్లికి వందనం’ పథకాన్ని 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అమలు చేస్తోంది. అర్హులైన విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయనుంది.

PREV
14
జూలై 22 నుంచి ప్రారంభం.. అర్హుల జాబితా కూడా అదే రోజు

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా, నిధుల విడుదలకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 22న గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ధ్రువీకరణ పూర్తయిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అదే రోజు నుంచి ఆర్థిక సాయం జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిశీలించి ఆగస్టు 10 నాటికి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.

24
ఎవరు అర్హులు.. ఎంత మొత్తం అందుతుంది?

ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు, 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 మంజూరు చేస్తారు. అయితే ఇందులో రూ.2,000ను పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మిగిలిన రూ.13,000ను తల్లి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు.

34
కొత్త అడ్మిషన్లకు ప్రత్యేక అవకాశం.. ఆగస్టు 30న నిధుల జమ

కొత్తగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులను కూడా ప్రభుత్వం పథకంలో చేర్చింది. 1వ తరగతి, 9వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా అడ్మిషన్ పొందిన అర్హుల వివరాలను ఆగస్టు 25 వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారి అర్హతలను పరిశీలించిన తర్వాత ఆగస్టు 30న అదనపు లబ్ధిదారుల జాబితాను ప్రకటించి, అదే రోజు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో కూడా ఆర్థిక సాయం జమ చేయనున్నారు.

44
ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు కూడా వర్తింపు.. ప్రత్యేక నిబంధనలు

ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లను పరిగణనలోకి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అందించనుంది. విద్య కారణంగా కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించడం, పేద విద్యార్థులు చదువును మధ్యలో నిలిపివేయకుండా ప్రోత్సహించడం, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులందరికీ సమానంగా ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.

Read more Photos on
click me!

Recommended Stories