తమ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఒకవేళ బాలేదనిపిస్తే తన నెంబర్ కు ఫోన్ చేసి బూతులు తిట్టమని పబ్లిక్ స్టేజి మీద ఓపెన్ ఆఫర్ ఇచ్చి షాక్ ఇచ్చారు.
అజయ్ ఘోష్ (Ajay Ghosh), చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). ఫ్లై హై సినిమాస్ బ్యానర్పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూన్ 14న గ్రాండ్గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అజయ్ ఘోష్ మాట్లాడుతూ తమ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఒకవేళ బాలేదనిపిస్తే తన నెంబర్ 92******66 కి ఫోన్ చేసి బూతులు తిట్టమని పబ్లిక్ స్టేజి మీద ఓపెన్ ఆఫర్ ఇచ్చి షాక్ ఇచ్చారు.
‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథకు అజయ్ ఘోష్నే ఎందుకు అనుకున్నారనే విషయాన్ని దర్శకుడు శివ పాలడుగు వివరిస్తూ... పాతికేళ్ల కుర్రాడి కథ చెబితే మళ్లీ రొటీన్ అవుతుందని, కాస్త కొత్తగా ఉండాలనే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కథను రాసుకున్నాను. ఈ కథకు అజయ్ ఘోష్ అయితే బాగుంటుందని అనుకున్నాను. కాస్త కొత్తగా ఉంటుందనే ఆయనతో ఈ కారెక్టర్ వేయించాను. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను అని చెప్పుకొచ్చారు.
అలాగే ఏదో సందేశం ఇవ్వాలని ఈ కథను రాసుకోలేదు. పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్గా ఉంటుందని ఆడియెన్స్కు చెప్పాలనే ఈ కథను రాసుకున్నాను అన్నారు.
చిత్రం స్టోరీ లైన్ ఏమిటంటే... గుంటూరులో ఒక మ్యూజిక్ షాప్ నడుపుతుంటాడు 50 ఏండ్ల మూర్తి (అజయ్ ఘోష్). అయితే కాలం మారి యువత టెక్నాలజీకి అలవాటు పడడంతో తన మ్యూజిక్ షాప్కు జనాలు రావడం మానేస్తారు. ఈ క్రమంలోనే తనకి డీజే ఆపరేటర్ అవ్వాలని కోరిక పుడుతుంది. అయితే ఆ విషయం ఇంట్లో తన భార్యకి చెప్పిన, బయట స్నేహితులకు చెప్పిన ఈ వయసులో డీజే ఏంటి అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ కోసం మూర్తి ఏమి చేశాడు అనేది సినిమా స్టోరీ. చాలా రోజుల తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్తో అజయ్ ఘోష్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సత్య కిషోర్ బచ్చు, వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి, సత్యనారాయణ పాలడుగు సహా నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.