హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

By telugu teamFirst Published Sep 21, 2019, 2:03 PM IST
Highlights

అతనే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనికి టికెట్ దక్కలేదు. ఇప్పుడు రఘువీర్ రెడ్డిని గనుక ఇక్కడినుండి నిలబెడితే బాగుంటుందని బీజేపీ యోచిస్తోంది. దానికితోడు, కాంగ్రెస్, తెరాస రెండు పార్టీలు కూడా ఇక్కడ స్థానికంగా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులను బరిలోకి దింపడంతో, వారిని ఎదుర్కోవాలంటే ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతను దింపాలని బీజేపీ భావిస్తోంది. 

తెలంగాణలోని హుజుర్ నగర్  అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక ప్రకటన విడుదలయ్యింది. అక్టోబర్ 21న పోలింగ్  జరగనుండగా, అక్టోబర్ 24న కౌంటింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. 

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల ఎన్నికలకు ప్రకటన విడుదల చేస్తూ, వాటితో పాటే దేశంలోని మరో 64 స్థానాలకు కూడా ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రకటన విడుదల చేసారు. 

తెలంగాణలోని హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం కూడా ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. 2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. దీనితో హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. 

నోటిఫికేషన్ కూడా విడుదలవడంతో అన్ని పార్టీలకు చెందిన ఆశావాహులు తమ పార్టీ అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి తన సతీమణి పద్మావతి పోటీ చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏకపక్షంగా ఇలా ఎలా ప్రకటిస్తారంటూ రేవంత్ రెడ్డి బాహాటంగానే ఈ చర్యను ఖండించిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్దీ, టికెట్ ఆశించేవారు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఉత్తమ్ ఇలా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వాపోయినట్టు సమాచారం. 

మరోవైపు తెలంగాణాలో బీజేపీ పుంజుకోవడంతో వారు కూడా ఈ సీటులో ఒక బలమైన వ్యక్తిని పోటీకి దింపాలని భావిస్తోంది. ఇందుకోసం మొదటగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య పేరును పరిశీలించారు. కానీ తదనంతర పరిస్థితుల వల్ల రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా ఆగిపోయారు. దీనితో ఇప్పుడు అభ్యర్థి వేటలో ఉన్న బీజేపీ ఒక సీనియర్ కాంగ్రెస్ నేత కొడుక్కి గాలం వేస్తున్నట్టు తెలుస్తుంది. 

అతనే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం విశ్వప్రయత్నం చేసినప్పటికీ కూడా అతనికి టికెట్ దక్కలేదు. ఇప్పుడు రఘువీర్ రెడ్డిని గనుక ఇక్కడినుండి నిలబెడితే బాగుంటుందని బీజేపీ యోచిస్తోంది. దానికితోడు, కాంగ్రెస్, తెరాస రెండు పార్టీలు కూడా ఇక్కడ స్థానికంగా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులను బరిలోకి దింపడంతో, వారిని ఎదుర్కోవాలంటే ఇదే సామాజిక వర్గానికి చెందిన నేతను దింపాలని బీజేపీ భావిస్తోంది. 

ఆర్థికంగా కూడా మంచి స్థితిమంతుడవడం, తండ్రి చరిష్మా కూడా ఉండడం, ఈ ప్రాంతంలో బలమైన పరిచయాలు, యువకుడు, చదువుకున్నవాడు ఇవన్నీ వెరసి సీనియర్ కాంగ్రెస్ నేత జానా రెడ్డి కొడుకు రఘువీర్ రెడ్డికి బీజేపీ గాలం వేస్తుంది. కాంగ్రెస్ ఓట్లను కూడా చీల్చే అవకాశాలు మెండుగా ఉండడంతో బీజేపీ తన స్పీడ్ ను మరింత పెంచింది. 

తెరాస నుంచి సైది రెడ్డి పేరు బాగా వినపడుతుంది. మొన్నటివరకు అతని పేరు దాదాపు ఖాయంగా కనపడింది. ఇప్పుడు తెలంగాణ తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ పేరు మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఈ వైపుగా శంకరమ్మ తన ప్రయత్నాలను కూడా మొదలుపెట్టింది.కాంగ్రెస్ అభ్యర్థి  పద్మావతి మహిళా కాబట్టి, ఒక మహిళపై మరో మహిళను పెడితే సమీకరణాలు కలిసివస్తాయని, లేకుంటే మహిళపై పోటీ అంటే తెరాస కు కష్టమని శంకరమ్మ వాదిస్తోంది. 

అంతేకాకుండా, ఇరు ప్రధాన పార్టీలు అగ్రకులస్థులను నిలబెడుతున్నారు కాబట్టి తానొక బీసీ మహిళనవ్వడంవల్ల బీసీల ఓట్లను కొల్లగొడుతానని చెబుతున్నారు. కాకపోతే సైదిరెడ్డికి ఈ ప్రాంతంలో బలమైన బంధువర్గం ఉండడం, మంత్రి జగదీశ్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉండడం, ఆర్థికంగా కూడా మంచి స్థితిలో ఉండడం, ఇత్యాది కారణాల వల్ల సైది రెడ్డి వైపే తెరాస  అధిష్టానం మొగ్గుచూపే విధంగా కనపడుతుంది. అందుతున్న సమాచారం మేరకు సైదిరెడ్డి పేరునే కెసిఆర్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 

ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నప్పటికీ కూడా, ఆశావాహుల రాకతో పార్టీ కార్యాలయాలు బిజీగా మారాయి. ఒకింత పార్టీల అధిష్టానాలకు ఈ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక తలనొప్పి వ్యవహారంగా కూడా మారింది. 

సంబంధిత వార్తలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఈ మధ్యే వచ్చినోళ్ల సలహాలు అక్కర్లేదు: రేవంత్‌పై కోమటిరెడ్డి వ్యాఖ్యలు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కాంగ్రెసు అభ్యర్థి పద్మావతి, ఉత్తమ్ ప్రకటన

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఉత్తమ్ పద్మావతికి రేవంత్ రెడ్డి నిరసన సెగ

నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికలకు నోటిఫికేషన్: లిస్ట్‌లో లేని హుజూర్‌నగర్‌

click me!