చంద్రబాబుకు ఆ 23 కూడా వుండవు...జగన్ లక్ష్యమదే...: ఆళ్ల నాని

By Arun Kumar PFirst Published Oct 23, 2019, 5:10 PM IST
Highlights

ఏపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఆయన తీరు మారకుంటే ఇప్పుడున్న 23  ఎమ్మెల్యే సీట్లు కూడా మిగలవని హెచ్చరించారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని రిమ్స్ వైద్యశాలలో మంత్రులు ఆళ్ళ నాని, బాలినేని శ్రీనివాసుల రెడ్డి లు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఇక్కడ అందుతున్న వైద్యసేవలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి చికిత్స పొందుతున్న పేషెంట్స్, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందిపై భారీగా ఫిర్యాదులు అందాయి.

ముఖ్యంగా కింద స్థాయి సిబ్బంది తమను డబ్బులు డిమాండ్ చేస్తూ జలగల్లా పీక్కు తింటున్నారని మంత్రుల ముందు పేషెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో హాస్పిటల్లో అందిస్తున్న చికిత్స, సిబ్బంది వ్యవహారశైలిపై ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు రివ్యూ చేపట్టారు. కింది స్థాయి సిబ్బంది పనితీరును నిత్యం పరిశీలిస్తూ రోగులతో స్నేహపూర్వకంగా వుండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు.

 

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల కృష్ణ శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ...వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి నెలలోపు పూర్తి స్థాయిలో 108  వాహనాలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమయ్యిందన్నారు. మరో రెండున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కంటి సమస్యలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

 వైద్యం అందక ఏ ఒక్క పేదవాడు చనిపోకూడదన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని అన్నారు.  గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా నాశనమయ్యిందని విమర్శించారు. 

 ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమలకు ప్రజల నుండి వస్తున్న స్పందన...రోజుకోజుకూ పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఇప్పుడు వచ్చిన 23 సీట్లు కూడా రావని ఆయనలో ఆందోళన మొదలయ్యిందని ఎద్దేవా చేశారు. 
 
చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి కార్యక్రమాన్ని విమర్శించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నట్లున్నారని అన్నారు.  ఆయన ప్రభుత్వ హయాంలోనే ఆరోగ్యశ్రీ లబ్ది దారులకు చెల్లని చెక్కులిచ్చి ఇబ్బందులకు గురిచేసిన మాట వాస్తవం కాదా...అని ప్రశ్నించారు.

కంటి వెలుగును తానే ప్రవేశపెట్టినాని చెబుతున్న చంద్రబాబు అసలు కంటి వెలుగు పధకాన్ని ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఇలా ప్రతిది తానే చేసినట్లు చెప్పుకోవడం చంద్రబాబుకు ఇప్పుడు కాదు ఎప్పటినుండో అలవాటని మంత్రి నాని అన్నారు.
 

click me!