
Virat Kohli announces T20I retirement : ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను ఓడించి టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ గెలుపులో విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. యావత్ భారతావని ఈ సంబురాలు చేసుకుంటున్న సమయంలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ షాకింగ్ ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో చారిత్రాత్మక విజయం తర్వాత టీ20 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు కింగ్ కోహ్లీ. బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ ఓడించి 11 సంవత్సరాల ఐసీసీ ట్రోఫీ కలను అందుకున్న కొద్ది క్షణాల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
జూన్ 29న జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడింది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అత్యధిక స్కోరును నమోదు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ లు అద్భుతమైన బౌలింగ్ తో దక్షిణాఫ్రికాను 169/8 పరుగులకే పరిమితం చేశారు. దీంతో భారత జట్టు 7 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్ గా నిలిచింది.
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. "ఇది నా చివరి టీ20 ప్రపంచ కప్.. మేము సాధించాలనుకున్నది ఇదే. ఒక రోజు మీరు పరుగు సాధించలేరని మీరు భావిస్తారు, అప్పుడు విషయాలు జరుగుతాయి. దేవుడు గొప్పవాడు.. ఆ రోజు నేను జట్టు కోసం పని చేసాను. ఇది ఎంతో విలువైనది.. ఎన్నడూ లేనిది. భారత్ కోసం దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలని కోరుకుంది. మన అద్భుతమైన ఆటగాళ్ళు జట్టును ముందుకు తీసుకెళ్లి మన జెండాను రెపరెపలాడిస్తారు' అని మ్యాచ్ అనంతరం జరిగిన ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పాడు.
టీ20 క్రికెట్ లో 35 ఏళ్ల విరాట్ కోహ్లీ అసాధారణమైన ప్రతిభతో అదరగొట్టాడు. భారత్ తరఫున 125 టీ20ల్లో ఆడిన కోహ్లి ఒక సెంచరీ, 38 హాఫ్ సెంచరీలతో సహా 4188 పరుగులు చేశాడు. భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్ట సమయంలో కోహ్లి సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (47), శివమ్ దూబే (27)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లతో విరాట్ కోహ్లీ ఆడిన 76 పరుగుల ఇన్నింగ్స్ ఈ విజయంలో కీలకంగా మారింది.
జయహో భారత్.. దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి 17 ఏండ్ల తర్వాత ఛాంపియన్గా టీమిండియా