
అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ద్వారా కోట్లాది రూపాయలు మోసం జరిగిన కేసులో మనీ లాండరింగ్ దర్యాప్తు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పను విచారణకు పిలిచింది. ఈ నెల సెప్టెంబర్ 22న ఆయన హాజరుకావాలని అధికారికంగా సమన్లు జారీ చేసింది.
అక్రమ బెట్టింగ్ యాప్ల ద్వారా లక్షలాది మంది పెట్టుబడిదారులు, యూజర్లను మోసం చేసి డబ్బు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో పన్ను ఎగవేత కూడా జరిగిందని ED అనుమానిస్తోంది.
రాబిన్ ఉతప్పతో పాటు, శిఖర్ ధావవ్ను కూడా ED ఇప్పటికే సెప్టెంబర్ 4న విచారించింది. ధావన్ పేరు ఓ బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేసిన నేపథ్యంలో వినిపించింది. అలాగే మాజీ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇదే కేసులో ED ఎదుట హాజరయ్యారు. క్రికెటర్లతో పాటు, బాలీవుడ్ నటి ఉర్వశి రౌటేలా, మాజీ ఎంపీ, నటి మిమి చక్రబర్తిలకూ సమన్లు జారీ చేశారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం రియల్ మనీతో జరిగే ఆన్లైన్ గేమింగ్కి నిషేధం విధించే చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అక్రమ బెట్టింగ్ యాప్లు, మనీ లాండరింగ్ను అరికట్టడమే దీని ఉద్దేశ్యం.
ఇదిలా ఉంటే మార్కెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో సుమారు 22 కోట్ల మంది అక్రమ బెట్టింగ్ యాప్లలో రిజిస్టర్ అయ్యారు. అందులో 11 కోట్ల మంది యూజర్లు రెగ్యులర్గా యాక్టివ్గా ఉన్నారు. ఈ విస్తృత స్థాయిలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ED వేగంగా చర్యలు తీసుకుంటోంది.