
టీమిండియా మాజీ సారథి, పరుగుల యంత్రం విరాట్ కోహ్లి చాలా రోజుల తర్వాత తనలోని ఆటను బయటకు తీస్తూ.. గురువారం వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20 లో చెలరేగి ఆడాడు. సరైన ఆరంభం దక్కని టీమిండియాకు.. తన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కోహ్లిపై హిట్ మ్యాన్ ప్రశంసలు కురిపించాడు. తమకు అనుకున్న ఆరంభం దక్కలేదని, కానీ విరాట్ కోహ్లి మాత్రం అద్భుత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ లో తాము ఆధిపత్యం చెలాయించేలా చేశాడని కొనియాడాడు.
ఇదే విషయమై నిన్నటి మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ స్పందిస్తూ.. ‘జట్టుకు అవసరమైన సమయంలో కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడిని అధిగమించి.. జట్టు బాధ్యతలను తన భుజాలపై మోశాడు. వాస్తవంగా ఈ మ్యాచులో మాకు మెరుగైన ఆరంభం లభించలేదు. కానీ కోహ్లి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మా చేతుల్లోకి వచ్చింది. ఒత్తిడిని అధిగమిస్తూ కోహ్లి ఆడిన షాట్లు కంటికి ఇంపుగా ఉన్నాయి. ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు..’ అని తెలిపాడు..
కాగా.. గురువారం విండీస్ తో జరిగిన రెండో టీ20లో 2 పరుగులకే ఇషాన్ కిషన్ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. ముందు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (19) తో కలిసి 49 పరుగులు జోడించిన కోహ్లి.. ఆ తర్వాత రిషభ్ పంత్ (52) తో కూడా చక్కని భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ ఇద్దరి హాఫ్ సెంచరీలతో పాటు ఆఖర్లో వెంకటేశ్ అయ్యర్ (18 బంతుల్లో 33.. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన విండీస్ కూడా ధీటుగానే రాణించింది. నికోలస్ పూరన్ (62), ఆర్. పావెల్ (68 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చింది. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ ల మ్యాజిక్ తో వెస్టిండీస్ కు ఓటమి తప్పలేదు. 186 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్.. 178 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. రిషభ్ పంత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తాజా విజయంతో భారత్.. టీ20 సిరీస్ ను కూడా 2-0 తో సొంతం చేసుకుంది. రోహిత్ సేన ఇప్పటికే వన్డే సిరీస్ కూడా నెగ్గిన విషయం తెలిసిందే. సిరీస్ లో చివరిదైన ఆఖరు టీ20.. ఆదివారం జరగాల్సి ఉంది.