Latest Videos

T20 World Cup : 17 ఏళ్ల హిస్టరీలో ఇదే తొలిసారి.. ఎవరు గెలిచినా సరికొత్త చరిత్రే.. !

By Mahesh RajamoniFirst Published Jun 28, 2024, 9:31 PM IST
Highlights

T20 World Cup 2024 final : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్ మ్యాచ్ లో భార‌త్-ద‌క్షిణాఫ్రికాలు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇరు జ‌ట్లు స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ఇరుజ‌ట్ల కెప్టెన్లు రోహిత్ శ‌ర్మ‌- ఐడెన్ మార్క్రామ్ లు ఫైన‌ల్ మ్యాచ్ లో గెలిచి మెగా టోర్నీ ట్రోఫీని అందుకోవాల‌ని వ్యూహాలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు.

T20 World Cup 2024 final : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 టోర్నీ ఫైన‌ల్ కు చేరుకుంది. రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా, ఐడెన్ మ‌ర్క్ర‌మ్ నేతృత్వంలోని ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచ్ లో త‌ల‌ప‌డ‌నున్నాయి. శనివారం జరిగే టైటిల్ మ్యాచ్‌లో 2007లో చాంపియన్‌గా నిలిచిన భారత్ తొలిసారి ఫైనల్‌కు చేరుకుంటున్న దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ బార్బడోస్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు ఇప్ప‌టికే వ్యూహాల‌తో సిద్ధమయ్యాయి. ఈ క్ర‌మంలోనే స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించనున్నాయి.

2007లో ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ తొలి ఎడిషన్‌లోనే భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. మొత్తం టోర్నీలో అజేయంగా నిలిచిన జట్టు 17 ఏళ్ల తర్వాత తొలిసారి ఓట‌మి లేకుండా ఫైన‌ల్ కు చేరుకుంది. ఇది తొమ్మిదో ఎడిషన్ కాగా గత ఎనిమిది ఎడిషన్లలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఏ జట్టు కూడా ఛాంపియన్ గా నిలవడం ఎప్పుడూ జరగలేదు. 2007 నుంచి 2022 టీ20 ప్రపంచకప్‌ వరకు చాంపియన్‌గా నిలిచిన టోర్నీలో ఒక్క మ్యాచ్ అయ‌నా ఓడిపోయింది. అయితే, ఈసారి ఫైన‌ల్ కు చేరిన‌ దక్షిణాఫ్రికా-భారత జ‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైన‌ల్ కు చేరుకున్నాయి.

తొలిసారి ఫైన‌ల్ కు చేరిన ద‌క్షిణాఫ్రికా.. 

ఐడెన్ మార్క్రామ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి, ఎనిమిదింటిలోనూ విజయం సాధించింది. మార్క్రామ్ జట్టు గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు, సూపర్-8 రౌండ్‌లో మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఆ తర్వాత సెమీ ఫైనల్స్‌లో గెలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి జట్లను ఓడించింది. ఆ తర్వాత సూపర్-8 రౌండ్‌లో అమెరికా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లను ఓడించింది. సెమీ-ఫైనల్స్‌లో, దక్షిణాఫ్రికా జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి మొదటిసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుంది. ఇంతకు ముందు ఏ ఐసీసీ టోర్నీలోనూ దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ చేరలేదు. ఇప్పుడు ఆ జట్టు ఛాంపియన్‌గా మారితే.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా తొలిసారిగా ఐసీసీ ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీని అందుకున్న  జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించ‌నుంది.

టీమిండియాది స‌రికొత్త చ‌రిత్రే.. 

రోహిత్ శర్మ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు అయింది. అంటే ఇప్ప‌టివ‌కు ఒక్క ఓట‌మి లేకుండా టీమిండియా ఫైన‌ల్ కు చేరుకుంది. భారత్ గ్రూప్ దశలో మూడు మ్యాచ్‌లు, సూపర్-8 మూడు మ్యాచ్‌లు గెలిచింది. గ్రూప్‌ దశలో ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, అమెరికా జట్లపై భారత్‌ విజయం సాధించింది. అయితే కెనడాతో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సూపర్-8లో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, 2021 ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి ఫైన‌ల్ చేరుకుంది. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని భార‌త జ‌ట్టు ఛాంపియన్‌గా మారితే, ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఒక ఎడిషన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా టీమిండియా స‌రికొత్త చ‌రిత్ర సృష్టించ‌నుంది. అలాగే, 2007 తర్వాత భారత్‌కు ఇది రెండో టీ20 ప్రపంచకప్ కానుంది.

17 ఏళ్లలో తొలిసారి ఇలా.. 

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైనల్‌లో భార‌త్-ద‌క్షిణాఫ్రికాలు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైన‌ల్ ఆడ‌టం 17 ఏళ్లలో ఏ టీ20 ప్రపంచకప్‌లోనూ ఇలా జరగలేదు. అయితే, భార‌త జ‌ట్టు 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎడిషన్‌లో ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. ఆ తర్వాత భారత్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించింది. 11 ఏళ్ల తర్వాత భారత్‌కు చరిత్ర పునరావృతం అయ్యే అవకాశం వచ్చింది. అంతే కాదు ఫైనల్‌లో టీమిండియా గెలిస్తే ఏదైనా ఒక ఎడిషన్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ రికార్డు దక్షిణాఫ్రికా పేరుపై ఉంది. ఈ ఎడిషన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు గెలుపొందగా, ఏడు విజయాలతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఫైనల్లో భారత్ గెలిస్తే దక్షిణాఫ్రికాతో సమంగా నిలుస్తుంది. 

ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. ఓదార్చిన విరాట్ కోహ్లీ.. వీడియో

click me!