
పరిమిత ఓవర్లలో టీమిండియా కొత్త సారథి రోహిత్ శర్మ త్వరలో వెస్టిండీస్ తో జరుగబోయే వన్డే సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందే అతడు భారత జట్టుకు వన్డే, టీ20లలో పూర్తి స్థాయి సారథిగా నియమితుడైనా.. సఫారీలతో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్ కు గాయం కారణంగా దూరమయ్యాడు. ఫిట్నెస్ లేమితో ఇన్నాళ్లు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో గడిపిన రోహిత్ శర్మ.. గతంలో కంటే ఇప్పుడు ఫిట్ గా తయారయ్యాడు. తాజాగా అతడు విండీస్ తో వన్డే సిరీస్ కు ముందు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశాడు.
తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రోహిత్ శర్మ స్పందిస్తూ... ‘ప్రారంభానికి ముందు ఈ నిరీక్షణను తట్టుకోలేకపోతున్నా..’ అని రాసుకొచ్చాడు. ఎన్సీఏ లో ఫుల్ ఫిట్ అయి వచ్చిన రోహిత్ శర్మ గతంలో కంటే ఆరు కిలోల బరువు తగ్గాడు. ఫిట్నెస్ పై వరుసగా విమర్శలు ఎదుర్కుంటున్న అతడు.. భారీ లక్ష్యంతో గ్రౌండ్ లోకి అడుగు పెట్టనున్నాడు.
గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా భారత జట్టు విండీస్ తో మూడు వన్డేలు ఆడనుంది. ఈ నెల6న జరుగుబోయే తొలి వన్డే.. భారత్ కు వెయ్యో వన్డే కానున్నది. ఈ అరుదైన మ్యాచ్ ద్వారా రోహిత్ పూర్తి స్థాయి సారథిగా కొత్త శకానికి నాంది పలుకబోతున్నాడు.
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ తో పాటు వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో జట్టును ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవడం రోహిత్ శర్మ ముందున్న సవాల్. అందులో భాగంగా రోహిత్.. విండీస్ రూపంలో తొలి సవాల్ ను ఎదుర్కోనున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టీ20 సిరీస్ లో ఆ జట్టు.. విజయదుందుభి మోగించి ఆత్మవిశ్వాసంతో భారత్ లో అడుగుపెట్టింది. భారత్ ను భారత్ లో ఓడించడానికే ఇక్కడకు వచ్చామని ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు జేసన్ హోల్డర్ హెచ్చరికలు కూడా పంపాడు.
కాగా.. వన్డే సిరీస్ జరుగునున్న అహ్మదాబాద్ స్టేడియంలో విండీస్ పై మన రికార్డేమీ బాగోలేదు. ఇక్కడ ఇంతవరకు విండీస్.. భారత్ తో ఐదు సార్లు తలపడగా.. ఒక్కసారి మాత్రమే మనం నెగ్గాం. నాలుగు సార్లు విజయం కరేబియన్లనే వరించింది. మరి భారత్ ఆడుతున్న వెయ్యో వన్డేకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ.. విండీస్ కు చెక్ పెడతాడా..? లేదా అనేది ఫిబ్రవరి 6న తేలుతుంది.
వన్డే సిరీస్ షెడ్యూల్ :
ఫిబ్రవరి 6న తొలి వన్డే : నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ఫిబ్రవరి 9న రెండో వన్డే : నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ఫిబ్రవరి 11న మూడో వన్డే : నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్