కరోనా -వ్యాక్సిన్ పై కన్ఫూజన్: ఐసీఎంఆర్ ప్రకటనపై కేంద్రం క్లారిటీ..

By Sandra Ashok KumarFirst Published Jul 6, 2020, 10:43 AM IST
Highlights

2021 వరకు కరోనా మహమ్మరిని నియంత్రించడానికి రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఇప్పట్లో రాదని కేంద్రం వివరణ ఇచ్చింది. వచ్చే నెల 15 నాటికి టీకా తయారవుతుందని ఐసీఎంఆర్ చేసిన ప్రకటనపై గందరగోళం నెలకొనడంతో కేంద్రం క్లారిటీనిచ్చింది. కేవలం ట్రయల్స్‌కే తొమ్మిది నెలలు కావాలని డబ్లూహెచ్ఓ చీఫ్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించింది.

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వ్యాధి నివారణకు తయారుచేసే వ్యాక్సిన్ 2021 కంటే ముందు సిద్ధమయ్యే అవకాశం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్‌ -19ను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఆగస్టు 15వ తేదీ లోపు అందుబాటులోకి రావాలని భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఆదేశాలివ్వడంపై దుమారం చెలరేగుతున్నది.

ఈ నేపథ్యంలో స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం వివరణనిచ్చింది. మరోవైపు, వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. భారత్ బయోటెక్ సారథ్యంలో కొవాగ్జిన్‌, జైడస్ కాడిల్లా ఆధ్వరయంలో జైకోవ్‌-డీతోపాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదన్నది.

‘కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం ఆరు భారతీయ ఫార్మా కంపెనీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీ వ్యాక్సిన్‌లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 140 వ్యాక్సిన్‌లు ప్రయోగదశలో ఉన్నాయి’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

‘ఇందులో 11 వ్యాక్సిన్లు హ్యూమన్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయి. ఇందులో ఏ ఒక్క వ్యాక్సిన్‌ 2021 కంటే ముందు అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదు’ అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

also read కరోనా దెబ్బకి ఎయిర్‌ఫ్రాన్స్‌లో 7500 ఉద్యోగాలు హాంఫట్! ...

డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీవో) నుంచి హ్యూమన్‌ ట్రయల్స్‌ కోసం కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీకు అనుమతులు లభిస్తే, అది కరోనా అంతమయ్యే క్రతువుకు ఆరంభ సూచకమని కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌ 2021లోపు వచ్చే అవకాశం లేదని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ పేర్కొంది. దీనికి కారణాలనూ వివరించింది. వ్యాధిని కట్టడి చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధి 3 దశల ట్రయల్స్‌లో జరుగుతుంది. 

తొలి రెండు దశల్లో వ్యాక్సిన్‌ సురక్షితమా? కాదా? అనే వాటిపై పరీక్షలు జరుపుతారు. మూడో దశలో వ్యాక్సిన్‌ సమర్థతపై పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో దశ పూర్తికావడానికి నెలల నుంచి ఏళ్ల సమయం పడుతుంది. 

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌', జైడస్‌ కాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డీ’ వ్యాక్సిన్‌లకు తొలి రెండు దశల ట్రయల్స్‌ నిర్వహించడానికి ఈ వారంలోనే అనుమతులు లభించాయి.

దీన్నిబట్టి చూస్తే ఆయా వ్యాక్సిన్‌లు పూర్తిస్థాయిలో పరీక్షలు జరుపుకోవాలంటే కొన్ని నెలల సమయం పట్టొచ్చు. అందువల్లే కేంద్రం 2021 కంటే ముందు వ్యాక్సిన్‌ రాకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్నా ట్రయల్స్‌ నిర్వహించడం ముఖ్యమని, దీనికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు.

నిర్ణీత ప్రణాళిక ప్రకారం అన్ని జరిగితేనే ఇది సాధ్యమని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు. ఐసీఎంఆర్‌ తాజా ప్రకటన నేపథ్యంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. కరోనా టీకా ఇప్పట్లో వచ్చే అవకాశంలేదని పరోక్షంగా వివరించారు. 
 

click me!