ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ‘నో’ రిజిస్ట్రేషన్ చార్జెస్

By rajesh yFirst Published Jun 20, 2019, 10:42 AM IST
Highlights


విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేవారికి మోదీ సర్కార్ తీపి కబురు అందించింది. ఇప్పుడు కొత్తగా కొనే వాహనాలతోపాటు వాటి రెన్యూవల్ కు కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించనవసరం లేదని తెలుపుతూ కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ ముసాయిదా వెల్లడించింది. దీనిపై నెల రోజుల్లో అభిప్రాయాలు తెలుపాలని కోరింది.

న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పర్యావరణ హిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు  నరేంద్రమోదీ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.

ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ఓ ముసాయిదా ప్రకటనను జారీ చేసింది. వాహన కాలుష్యం.. మానవ జాతి మనుగడనే ప్రమాదంలోకి నెడుతున్న నేపథ్యంలో కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం నిశ్చయించుకున్నది. 

2030 నాటికి వాడకంలో విద్యుత్ వాహనాలే ఉండాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నది. ఇందులో భాగంగానే విద్యుత్ ఆధారిత వాహనాల వైపు వాహనదారులు చూసేలా రిజిస్ట్రేషన్ చార్జీలను ఎత్తివేయాలని ప్రతిపాదించింది. 
ఇందుకోసం సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో సదరు మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. బ్యాటరీతో నడిచే వాహనాలకు రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పింది. ఈ మేరకు నిబంధన 81లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. 

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్, పాత వాహనాల రెన్యువల్ కోసం కూడా ఎలాంటి చెల్లింపులు జరుపనక్కర్లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ టూవీలర్లతోపాటు త్రీవీలర్, ఫోర్‌వీలర్ మిగతా అన్ని విద్యుత్ ఆధారిత వాహనాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. కాగా, తమ ఈ నిర్ణయంపై నెల లోపు అభిప్రాయాలను తెలుపవచ్చని రవాణా మంత్రిత్వ శాఖ చెప్పింది.
 

click me!